జనవరి 26న దేశం రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో.. అహ్మదాబాద్ మరియు నోయిడాలోని పలు పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిల్లు తీవ్ర ఆందోళన కలిగించాయి. శుక్రవారం ఉదయం ఈ మెయిల్స్ అందడంతో అటు విద్యాసంస్థలు, ఇటు తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అహ్మదాబాద్లో పరిస్థితి..
అహ్మదాబాద్లోని పలు పాఠశాలలకు అజ్ఞాత వ్యక్తుల నుండి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయని గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ వెల్లడించింది. సమాచారం అందిన వెంటనే క్రైమ్ బ్రాంచ్ అధికారులతో పాటు బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రిపబ్లిక్ డేకి కొన్ని రోజుల ముందు ఇలాంటి హెచ్చరికలు రావడం భద్రతా పరమైన సవాలుగా మారింది.
నోయిడాలో పాఠశాలల మూసివేత..
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ప్రముఖ శివ నాడార్ పాఠశాలకు ఈ రోజు ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పాఠశాల యాజమాన్యం తక్షణమే స్పందించింది. ముందస్తు జాగ్రత్త చర్యగా పాఠశాలను మూసివేస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రకటించారు. అప్పటికే బస్సుల్లో బయలుదేరిన విద్యార్థులను వెనక్కి పంపించి, వారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
శివ నాడార్ స్కూల్తో పాటు నోయిడాలోని కేంబ్రిడ్జ్ స్కూల్, బాల్ భారతి స్కూల్స్ కూడా అప్రమత్తమయ్యాయి. కేంబ్రిడ్జ్ స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. బాల్ భారతి స్కూల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ముందుగానే ముగించారు. అయితే 1 నుండి 12వ తరగతి విద్యార్థుల విషయంలో పాఠశాల షెడ్యూల్ ప్రకారం తనిఖీలు కొనసాగుతున్నాయని సమాచారం.
నోయిడా పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. బాంబు స్క్వాడ్, ఫైర్ బ్రిగేడ్ మరియు డాగ్ స్క్వాడ్లను వెంటనే ఆయా ప్రాంతాలకు తరలించారు. సైబర్ సెల్ బృందం ఈ మెయిల్లు ఎక్కడి నుండి వచ్చాయనే కోణంలో సాంకేతిక విశ్లేషణ చేస్తోంది. ప్రస్తుతానికి ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని.. అయితే భద్రత దృష్ట్యా ప్రతి మూలను తనిఖీ చేస్తున్నామని అధికారులు తెలిపారు.
తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని.. భద్రతా సిబ్బందికి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అహ్మదాబాద్, నోయిడా సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు.
ALSO READ: Kalvakuntla Kavitha: నేతాజీకి కవిత ఘన నివాళి.. అండమాన్ దీవుల పేరు మార్చాలని ప్రధానికి లేఖ