Indian Casualties: అమెరికా- ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణంలో భారతీయులు కూడా మరణించినట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. రాజ్యసభలో సీపీఐ ఎంపీ జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ వివరాలను పంచుకున్నారు.
మరణాలు, గాయపడిన వారి వివరాలు
యుద్ధ పరిస్థితి కారణంగా 10 మంది నావికులతో సహా మొత్తం 16 మంది భారత జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలు ఐదు విభిన్న దేశాల్లో నమోదయ్యాయి. ఒమన్లో ఎనిమిది మంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నలుగురు, కువైట్లో ఇద్దరు, అలాగే సౌదీ అరేబియా, ఇరాక్లలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
అంతేకాకుండా.. ఈ ఘర్షణల్లో 75 మంది భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో అత్యధికంగా యూఏఈలో 32 మంది, ఒమన్లో 24 మంది, కువైట్లో 13 మంది, ఖతార్లో నలుగురు, సౌదీ అరేబియా , ఇజ్రాయెల్లలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
తరలింపు చర్యలు, పరిహారం
యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా స్వగ్రామానికి చేర్చేందుకు ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఇరాన్ నుంచి ఇప్పటివరకు 2,557 మంది భారతీయులను సురక్షితంగా తరలించినట్లు మంత్రి తెలిపారు. అయితే, ఇప్పటికీ దాదాపు 7,000 మంది భారతీయులు ఆ దేశంలోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలను ఆదుకునే క్రమంలో, ప్రాణాలు కోల్పోయిన 16 మంది భారతీయుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేసింది. మిగిలిన భారతీయుల భద్రతను విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది.
Also Read: హైడ్రా కమిషనర్ను వెంటనే మార్చండి- హైకోర్టు