IndiGo Airlines: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక లోపం కారణంగా విమానం గంటల తరబడి ఆలస్యం కావడమే కాకుండా.. ప్రయాణికులను విమానం లోపలే ఉంచడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
చెన్నై నుంచి సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E 51) సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది. అయితే.. విమానం త్వరలోనే బయలుదేరుతుందని భావించిన సిబ్బంది.. సుమారు 200 మంది ప్రయాణికులను బోర్డింగ్ పూర్తి చేసి విమానం లోపలికి పంపారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో వారు ఏకంగా 5 గంటల పాటు విమానంలోనే బందీలుగా ఉండిపోయారు.
సాధారణంగా చెన్నై నుంచి సింగపూర్ ప్రయాణానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. కానీ.. అంతకంటే ఎక్కువ సమయం విమానం కదలకుండా రన్వే పైనే ఉండటంతో ప్రయాణికులు సహనం కోల్పోయారు.
విమానంలో గాలి సరిగ్గా ఆడకపోవడం, సరైన సమాచారం ఇవ్వకపోవడంతో వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి విషమించడంతో ప్రయాణికులు విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమను కిందకు దించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు ప్రయాణికులు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఇండిగో ఎయిర్లైన్ తీరుపై మండిపడుతున్నారు. సాంకేతిక లోపం ఉంటే ప్రయాణికులను టెర్మినల్లో ఉంచాలి కానీ ఇలా విమానంలో నిర్బంధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎయిర్లైన్స్ కనీస మర్యాదలు పాటించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: సీఎం రేవంత్ రెడ్డి విలాసాలపై హరీష్ రావు సెటైర్లు!
చెన్నై విమానాశ్రయంలో ఇండిగో ప్రయాణికులు ఆందోళన
చెన్నై నుండి సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమాన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. సాంకేతిక కారణాలతో విమానం ఆలస్యం కావడంతో, సుమారు 200 మంది ప్రయాణికులను ఏకంగా 5 గంటల పాటు విమానంలోనే కూర్చోబెట్టారు. ప్రయాణ సమయం కంటే ఎక్కువ సేపు… pic.twitter.com/pVBzrAdPSJ
— ChotaNews App (@ChotaNewsApp) February 25, 2026