Harish Rao: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత టి. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యతలు, రైతుల పట్ల అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ ఆయన చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
చరిత్రలో రైతుల కన్నీళ్లతో పునాదులు వేసుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించిన దాఖలాలు లేవని హరీష్ రావు హెచ్చరించారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రాధాన్యతలను పూర్తిగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు. పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వం.. అన్నం పెట్టే రైతన్నకు రైతుబంధు ఇవ్వడానికి మాత్రం నిధులు లేవని సాకులు చెబుతోందని మండిపడ్డారు.
ఫిబ్రవరి 4న మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి స్వయంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే నిధులు జమ చేస్తామని ప్రకటించారని.. కానీ ఎన్నికల కోడ్ ముగిసి పది రోజులు దాటుతున్నా దానిపై ఉలుకూ పలుకూ లేదని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఎకరానికి రూ.15వేలు ఇస్తామని నమ్మించి ఇప్పటికే రెండు సీజన్ల రైతుబంధుకు ఎగనామం పెట్టారని ఆరోపించారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలోనూ రైతుల సమస్యలపై చర్చించకపోవడం వారి కపట ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు.
రైతు బంధుకు నిధులు లేవంటున్న ప్రభుత్వం, ఇతర ప్రాజెక్టులకు వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తోందని ఆయన ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో, పార్కుల నిర్మాణానికి, ఇళ్ల కూల్చివేత పరిహారాలకు వేల కోట్లు వెచ్చిస్తున్నారని.. భూసేకరణ , రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని.. కేవలం ఈ ఆర్థిక సంవత్సరంలోనే బడా కాంట్రాక్టర్ల కోసం రూ.25వేల కోట్లు విడుదల చేశారని హరీష్ రావు విమర్శించారు. ఢిల్లీ పెద్దలకు మూటలు పంపడానికి నిధులు ఉంటాయి కానీ.. రైతులకు ఇవ్వడానికి చేతులు రావా అని నిలదీశారు.
‘ప్రజా పాలన’ అని చెప్పుకుంటూనే ముఖ్యమంత్రి తన కోసం జూబ్లీహిల్స్లో వందల కోట్లతో ప్యాలెస్ లాంటి క్యాంప్ కార్యాలయం నిర్మించుకుంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కేవలం ఆ కార్యాలయం చుట్టూ ఇనుప కంచెల కోసమే రూ.9 కోట్లు, ఫుట్బాల్ కోర్టు కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అందాల పోటీలకు, ఆటలకు వందల కోట్లు తగలేస్తూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పగటివేషాలు కట్టిపెట్టి, రైతుబంధు నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: పరకామణి చోరీ కేసులో అసలు దొంగలెవరు? చంద్రబాబు వైఖరిపై హర్షకుమార్ ఫైర్!