IndiGo Crisis: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నది. కార్యకలాపాలను వేగంగా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటీవల సంక్షోభం నేపథ్యంలో పరిస్థితిని మెరుగుపరిచేందుకు కంపెనీ చర్యలు చేపట్టింది. కంపెనీ ఆదివారం సుమారు 1650 విమాన సర్వీసులను నిర్వహించినప్పటికీ, వివిధ కారణాల వల్ల 650కు పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చినట్లు ఇండిగో ప్రకటించింది.
ఇది దేశవ్యాప్తంగా వేలాది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవడానికి దారితీసింది. ప్రత్యేకంగా పార్లమెంట్ శీతకాల సమావేశాల నడుమ ఢిల్లీకి పయనం అవుతున్న ఎంపీలు, అధికారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ మాట్లాడుతూ, ఇటీవల ఏర్పడిన ఆపరేషనల్ లోపాలను పరిష్కరించేందుకు.. సంస్థ పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటోందని తెలిపారు. డిసెంబర్ 10 నాటికి అన్ని షెడ్యూల్లు సాధారణ స్థితికి వస్తాయి. ప్రధాన మెట్రో నగరాలు, ఇతర ప్రాంతాల్లో సేవలు క్రమంగా మెరుగవుతున్నాయి అని పేర్కొన్నారు.
సేవల్లో అంతరాయం కలిగినందుకు, రద్దయిన సర్వీసుల ప్రయాణికులకు ఇండిగో భారీగా రిఫండ్లు చెల్లిస్తోంది. ఇప్పటివరకు అనేక రాష్ట్రాల్లోని ప్రయాణికులకు మొత్తం రూ.610 కోట్ల మొత్తాన్ని తిరిగి ఇచ్చినట్లు సంస్థ వెల్లడించింది.
తీవ్ర సేవల అంతరాయం నేపథ్యంలో, విమాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఇండిగోపై కఠిన చర్యలు తీసుకుంది. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్, సంస్థ అకౌంట్ మేనేజర్ ఈ ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. ఈ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి మరో 24 గంటల గడువు ఇవ్వబడింది. ఇకపై గడువు పొడిగించే యోచన ఏదీ లేదని డీజీసీఏ స్పష్టం చేసింది.
పౌర విమానాయన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఈ పరిణామాలపై స్పందిస్తూ, ఇండిగో కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం వల్ల దేశవ్యాప్తంగా ప్రయాణికులు మానసిక క్షోభకు గురయ్యారు. దీనికి బాధ్యులు ఎవరు? అనే దానిపై సమగ్ర విచారణ జరుగుతోంది. ఎవరినీ వదిలిపెట్టేది లేదు అని హెచ్చరించారు.
అలాగే పరిస్థితిని సమీక్షించేందుకు పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా ఇండిగో సంస్థ, డీజీసీఏ అధికారులను పిలిపించే అవకాశం ఉందని సమాచారం.
Also Read: ఇకపై ఆధార్ కొత్త రూల్స్.. జెరాక్స్కు ఫుల్స్టాప్, అంతా ఆ స్టయిల్లో
ఇండిగో ప్రతినిధుల ప్రకారం, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతా వంటి మెట్రో నగరాల్లో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. విమానాల రీషెడ్యూలింగ్, సిబ్బంది కేటాయింపు, వాతావరణ అంచనాల ప్రకారం ఫ్లైట్ ఆపరేషన్లను సర్దుబాటు చేస్తున్నట్లు తెలిపారు.