ISRO : తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ మరో రాకెట్ ప్రయోగానికి సన్నద్ధమైంది. సోమవారం ఉదయం 10.42 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్12 ప్రయోగం చేపట్టనున్నారు. ఈ వాహకనౌక ద్వారా ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలో ప్రవేశపెడతారు. ఈ ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 7.12 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 27.30 గంటలపాటు కొనసాగుతుంది.
షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళుతుంది. జీఎస్ఎల్వీ-ఎఫ్12 పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు. రాకెట్ బయలుదేరిన తర్వాత 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కిలోమీటర్ల ఎత్తులో జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెడుతుంది.
భారత దేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్వీఎస్-01 మొదటిది. 2,232 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు పని చేస్తుంది.. ఈ ఉపగ్రహం భారత్ ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కిలోమీటర్ల పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలను అందిస్తుంది.