IT Notice to Congress(Political news telugu):లోక్సభ ఎన్నికల వేళ ఐటీ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడటం లేదు. ఈ అంశంలో ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి ఐటీ శాఖ మరోసారి నోటీసులు ఇచ్చింది. నోటీసుల విషయాన్ని కాంగ్రెస్ అడ్వకేట్, ఎంపీ వివేక్ తంఖా శుక్రవారం తెలిపారు.
తమపై ఐటీ శాఖ ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. వెంటనే ఆ పార్టీకి నోటీసులు ఇచ్చింది ఐటీ శాఖ. 2017-18 నుంచి 2020-21 వరకు సంబంధించిన పెనాల్టీ, వడ్డీ కలిసి 1700 కోట్ల రూపాయలను తేల్చింది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. నేరుగా నోటీసులు ఇవ్వడంపై ఎంపీ వివేక్ తంఖా మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ అప్రజాస్వామిక చర్యగా వర్ణించారు. ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులు గురిచేయడానికి మోదీ సర్కార్ ప్లాన్ చేసినట్టు దుయ్యబట్టారు. దీనిపై చట్టపరంగా ఫైట్ చేస్తామన్నారు.
ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మదింపు ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన ఆధారాలు ఐటీ అధికారుల వద్ద ఉన్నాయని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. గతంలోనూ 2014 నుంచి 2017 వరకు సంబంధించిన ఐటీ వ్యవహారాలపై న్యాయస్థానం తిరస్కరించింది. ఇప్పటికే కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల నుంచి దాదాపు 135 కోట్ల రూపాయలను రికవరీ చేసుకుంది ఐటీ విభాగం.