Jairam Ramesh: కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ హయాంలో సాధించిన చారిత్రాత్మక విజయాలను గుర్తుచేస్తూనే.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ పాలనా విధానాలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
నెహ్రూ యుగం.. ఆధునిక భారతదేశానికి పునాది
1947 ఆగస్టు 15న జవహర్లాల్ నెహ్రూ అద్భుతమైన మంత్రివర్గంతో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాతి ఐదేళ్లలోనే ఆధునిక భారతదేశ రూపకల్పన జరిగింది. సుమారు 560కి పైగా సంస్థానాలు శాంతియుతంగా దేశంలో విలీనమయ్యాయి. రాజ్యాంగ ఆమోదం, జమీందారీ వ్యవస్థ రద్దు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం వంటి చారిత్రక నిర్ణయాలు జరిగాయి. బహుళార్ధసాధక ప్రాజెక్టులు, అణుశక్తితో కూడిన సైన్స్ రంగాల విస్తరణతో భారత్ ప్రపంచ శరవేగంగా ఎదిగింది. 17 కోట్ల ఓటర్లతో 1951-52లో దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారు. సర్దార్ పటేల్, డా. అంబేద్కర్, మౌలానా ఆజాద్ వంటి మహనీయులు ఈ పునాదిలో కీలక పాత్ర పోషించారు.
మోదీ పాలనపై విమర్శలు
నెహ్రూ సాధించిన ఈ ఘనతలను చెరిపివేయడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని జైరామ్ రమేష్ ఆరోపించారు. స్వతంత్ర ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా వంటి ప్రజాస్వామ్య పునాదులు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయని విమర్శించారు. విద్యాసంస్థల నాశనం వల్ల శాస్త్రీయ దృక్పథం దెబ్బతిందని, ఇటీవల జరిగిన నీట్, సీబీఎస్ఈ కుంభకోణాలే దీనికి నిదర్శనమన్నారు. ప్రైవేటీకరణ, ‘అర్హులు కారు’ (Not found Suitable) అనే సాకులతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు.
1952 వర్సెస్ 2024.. ఎన్నికల తీర్పు
నెహ్రూ 1952, 1957, 1962 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించగా, 2024 ఎన్నికల్లో మోదీ కనీసం సొంతంగా సాధారణ మెజారిటీని కూడా సాధించలేకపోయారని రమేష్ గుర్తుచేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీని పక్కనపెట్టి, హడావిడిగా ఎన్డీఏ సమావేశం ద్వారా మోదీ ప్రధానిగా ప్రకటించుకోవాల్సి వచ్చిందని, అందుకే 2024 ఎన్నికల ఫలితాలు మోదీకి అనుకూలమైన పూర్తి ప్రజా తీర్పు కాదని ఆయన స్పష్టం చేశారు.
Also Read: దుబాయ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు వలస కార్మికులు మృతి!