Dubai Accident: దుబాయ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. పొట్టకూటి కోసం, కుటుంబాలను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడం కోసం ఎడారి దేశానికి వెళ్లిన ముగ్గురు వలస కార్మికులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
మృతుల్లో జగిత్యాల జిల్లా మాల్యాల మండలానికి చెందిన గొల్లపల్లి తిరుపతి గౌడ్, కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన సయ్యద్ సలీం, మెట్పల్లి పట్టణంలోని గాజులపేటకు చెందిన అబ్దుల్ రఫీక్ ఉన్నారు. బతుకుదెరువు కోసం అప్పులు చేసి, ఎన్నో ఆశలతో దుబాయ్ వెళ్లిన వీరంతా ఒకే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నవారు దూరమవడంతో ఆయా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
రూపాయి సంపాదించి అప్పులు తీరుస్తారనుకుంటే, ఇలా శవాలై వస్తారని ఊహించలేదంటూ మృతుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం వారి మృతదేహాలు దుబాయ్లోనే ఉండటంతో, మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని బాధితులు వేడుకుంటున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని, ఉపాధి కోల్పోయిన తమను ఆదుకునేందుకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మృతుల కుటుంబ సభ్యులు కన్నీళ్లతో విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్లో భద్రతా వైఫల్యాలు.. వరుస ప్రమాదాలకు అసలు కారణం ఇదేనా?