LPG Gas Cylinder Price Hike: దేశంలో ధరల పెరుగుదల కంటిన్యూ అవుతున్నాయి. ఆయిల్.. గ్యాస్ సిలిండర్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా గృహ వినియోగదారులకు మరోసారి గ్యాస్ షాక్ తగిలింది. గ్యాస్ కంపెనీలు శనివారం అర్ధరాత్రి జూన్ 7 నుంచి ఎల్పీజీ సిలిండర్పై ధరను రూ.29 పెంచాయి.
సామాన్యుడి జేబుకు చిల్లు.. పెరిగిన గ్యాస్ సిలెండర్ ధరలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఆయిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కేవలం ఆయిల్ కాకుండా గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా గృహ వినియోగదారులకు గ్యాస్ షాక్ తగిలింది.14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 29 మేర పెంచాయి గ్యాస్ కంపెనీలు.
పెంచిన ఛార్జీలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. గడిచిన మూడు నెలల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం ఇది రెండోసారి. మార్చి ఏడున గ్యాస్ సిలిండర్ ధరలను రూ. 60 పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం.. ఢిల్లీలో గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్ ధర రూ. 913 నుంచి రూ. 942కు చేరింది. హైదరాబాద్లో 14 కేజీల గృహ వినియోగదారుల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 965 నుంచి రూ.994లకు చేరింది.
ఒక్కో సిలిండర్పై రూ. 29 పెంపు
విదేశాల నుంచి దిగుమతి వచ్చే ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరగడంతో కంపెనీలపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది. గృహ వినియోగదారులు ఉపయోగించే గ్యాస్ సిలిందరను ప్రభుత్వం నియంత్రిస్తోంది. ఫలితంగా ప్రతి సిలిండర్పై భారీ నష్టాలను చూస్తున్నాయి గ్యాస్ కంపెనీలు. ధరల సవరణకు ముందు ప్రతి గృహ ఎల్పీజీ సిలిండర్ విక్రయంపై సుమారు రూ.703 వరకు నష్టం వస్తోందని ఆ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
మే మధ్య నుండి పెట్రోల్-డీజిల్ ధరలు లీటరుకు రూ. 7.50 చొప్పున పెరిగాయి. సీఎన్జీ ధరలు కిలోకు సుమారు రూ. 6 పెంచాయి సదరు కంపెనీలు. పెట్రోల్పై లీటరుకు సుమారు రూ.11, డీజిల్పై లీటరుకు రూ.33.6 వరకు నష్టాలు ఎదుర్కొంటున్నట్లు సంబంధిత పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: ఢిల్లీలో హైడ్రామా.. ఎయిర్పోర్టులోనే ‘సీజేపీ’ అధినేత అరెస్ట్? రంగంలోకి పారామిలటరీ!
ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపు వల్ల మధ్య తరగతి కుటుంబాలపై అదనపు భారం పెరగనుంది. మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలు నెల వారీ ఖర్చుల్లో ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఈ విషయాన్ని ఆర్థిక నిపుణులు గుర్తు చేస్తున్నారు.