Encounter: ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండే సుక్మా జిల్లాలో మరోసారి కాల్పులు జరిగాయి. గోలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతం, కొండల మధ్య మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు వ్యూహాత్మకంగా రంగంలోకి దిగాయి. గురువారం తెల్లవారుజామున జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా, ఒక్కసారిగా మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.
పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా మావోయిస్టులు కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు ధీటుగా సమాధానమిచ్చాయి. ఈ ఘర్షణలో ముగ్గురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు మావోయిస్టుల మృతదేహాలతో పాటు, వారి వద్ద నుంచి అత్యాధునిక ఆయుధాలు, భారీగా పేలుడు పదార్థాలు, కొన్ని అత్యంత విలువైన అంతర్గత పత్రాలు లభ్యమయ్యాయి.
ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇంకా మరికొందరు మావోయిస్టులు నక్కి ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు గాలింపు చర్యలను (Combing) మరింత ఉధృతం చేశారు. అడవిపై పూర్తి పట్టున్న డీఆర్జీ బలగాలు కొండ కోనలను జల్లెడ పడుతున్నాయి. కాల్పుల సమయంలో కొందరు మావోయిస్టులు తప్పించుకుని అడవిలోకి పారిపోయినట్లు గుర్తించిన అధికారులు, అదనపు బలగాలను రప్పించి సరిహద్దు ప్రాంతాలను దిగ్బంధించారు. ఎవరూ తప్పించుకోకుండా నిఘా వర్గాలను అప్రమత్తం చేశారు.
Also Read: నేరస్థులకు సరిహద్దులు లేవు,హైదరాబాద్ పరిధిలో మూడు కమిషనరేట్ల మాస్టర్ ప్లానేంటి?
ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో సుక్మా జిల్లా వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉన్నందున, ప్రధాన రహదారులపై వాహనాల తనిఖీలను పెంచారు. సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అటవీ ప్రాంతం మొత్తం పోలీసుల నియంత్రణలో ఉండగా, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి
సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఘటన
పోలీసులు, మావోయిస్టుల మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పులు pic.twitter.com/rbkOd9mHBs
— BIG TV Breaking News (@bigtvtelugu) December 18, 2025