Thatikonda Rajaiah: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దాఖలు చేసిన అఫిడవిట్పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్లో మీడియాతో మాట్లాడుతూ.. కడియం శ్రీహరికి పోయేకాలం వచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వయసు మళ్ళిన దశలో ‘రామా.. కృష్ణా..’ అనుకుంటూ దైవచింతనతో బతకాల్సింది పోయి, “రాజకీయ వ్యభిచారానికి” పాల్పడుతున్నారని తీవ్ర పదజాలంతో దూషించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచి, ఇప్పుడు వారిని నట్టేట ముంచారని, ఘన్పూర్ నియోజకవర్గ ప్రజల ఉసురు కడియంకు కచ్చితంగా తగులుతుందని రాజయ్య మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని కడియం శ్రీహరి అఫిడవిట్లో పేర్కొనడంపై రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అనేకసార్లు తాను కాంగ్రెస్లో చేరానని, కాంగ్రెస్ కండువా కప్పుకున్నానని బహిరంగంగా ప్రకటించిన కడియం, ఇప్పుడు కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడం చూసి సభ్య సమాజం సిగ్గుపడుతోందన్నారు. ఈ నీతిమాలిన మాటలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ కూడా రాజ్యాంగాన్ని పట్టపగలు ఖూనీ చేశారని ఆరోపించారు.
కడియం శ్రీహరికి ఏమాత్రం సిగ్గు, శరం ఉన్నా తక్షణం ఎమ్మెల్యే పదవికి, బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయాలని రాజయ్య డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులకు క్షమాపణ చెబుతావా లేక కాంగ్రెస్ నాయకుల పంచన చేరతావా అని నిలదీశారు. ప్రజలకు నీ రాజకీయ వైఖరిపై ఏం సమాధానం చెబుతావని ప్రశ్నించారు. ఇకపై ఘన్పూర్ నియోజకవర్గంలో కడియంను అడుగుపెట్టనివ్వమని, ఆయన దిష్టిబొమ్మలు తగలబెట్టి నిరసనలు తెలుపుతామని రాజయ్య హెచ్చరించారు.
Read Also: CP Sajjanar: నేరస్థులకు సరిహద్దులు లేవు,హైదరాబాద్ పరిధిలో మూడు కమిషనరేట్ల మాస్టర్ ప్లానేంటి?