Honeymoon Couple Case : రం*కు నేర్చినోళ్లు బొంకు నేర్వరా అనేది సామెత. బాయ్ ఫ్రెండ్తో తిరుగుడుకు అలవాటు పడిన సోనమ్.. అతను తనకు బ్రదర్ లాంటి వాడంటూ ఇంట్లో కలరింగ్ ఇచ్చింది. కొన్ని ఏళ్ల పాటు రాఖీ కూడా కట్టింది. అతను కూడా ఆమెను అందరిముందు అక్కా అక్కా అని పిలిచేవాడు. అంతలా బరితెగించారు వాళ్లిద్దరూ. ఇప్పుడు ఏకంగా భర్తనే చంపించింది. మేఘాలయా హనీమూన్ మర్డర్ కేసులో ఇలా అనేక చేదు నిజాలు బయటపడుతున్నాయి. లవర్ రాజ్ కుశ్వాహకు సోనమ్ రాఖీ కట్టేదనే విషయం స్వయంగా ఆమె సోదరుడు గోవింద్ వెల్లడించారు. ఇకపై ఆమెతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. తమ మద్దతు రాజా రఘువంశీ ఫ్యామిలీకేనని స్పష్టం చేశాడు.
సోనమ్ను ఉరి తీయాలి..
గోవింద్.. రాజా రఘువంశీ కుటుంబాన్ని కలిశాడు. నేరుగా సంబంధం లేకపోయినా.. వారి ఇంట్లో ఈ విషాదం జరగడానికి తాను కూడా కారణమయ్యానని తెలిపాడు. రఘువంశీ సోదరుడు విపిన్తో కలిసి అతను మీడియాతో మాట్లాడాడు. రఘువంశీ తమ కుటుంబానికి నచ్చాడని.. అందుకే వివాహం జరిపించామన్నాడు. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదన్నాడు. ఈ దారుణంలో సోనమ్ హస్తం ఉండి ఉంటే.. ఆమెను ఉరి తీయాలని డిమాండ్ చేశాడు. అదే సమయంలో సోనమ్ లవర్ రాజ్ కుశ్వాహ గురించి కీలక విషయాలు తెలిపాడు.
అక్కా అంటూ.. రాఖీ కట్టించుకుంటూ..
రాజ్ కుశ్వాహ తమ వద్ద పనిచేసే వాడని.. సోనమ్ను అక్క అని పిలిచేవాడని చెప్పారు ఆమె సోదరుడు గోవింద్. గత మూడేళ్లుగా తనతో పాటు రాజ్ కూడా సోనమ్తో రాఖీ కట్టించుకున్నాడని చెప్పారు. అలాంటి వ్యక్తి సోనమ్తో రిలేషన్షిప్లో ఉన్నాడని కలలో కూడా ఊహించలేదన్నాడు గోవింద్. తమ ప్లైఉడ్ వ్యాపారాన్ని చూసుకోవడంలో రాజ్ కీలకంగా వ్యవహరించేవాడని తెలిపాడు.
బావ ఫ్యామిలీకే సపోర్ట్
ఓ రోజు తెల్లవారుజామున సోనమ్ తనకు కాల్ చేసిందన్నాడు గోవింద్. ఫోన్ చేసి ఏడుస్తుందని.. యూపీలో ఘాజీపూర్లోని ఓ దాబా దగ్గర ఉన్నట్టు చెప్పిందన్నాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు కాల్ చేశానని తెలిపాడు. తాను చెప్పేది నిజమని.. ఇకపై తమ లాయర్ రాజా రఘువంశీ ఫ్యామిలీ తరపునే పోరాడుతారని గోవింద్ స్పష్టం చేశారు.
భర్తను చంపేసి.. లవర్ను రూమ్కు పిలిపించుకుని..
మరోవైపు, విచారణలో నిందితురాలు సోనమ్ తన నేరాన్ని అంగీకరించారు. భర్త రాజా రఘువంశీ హత్యలో తన ప్రమేయం ఉందని చెప్పారు. మర్డర్ తర్వాత సోనమ్ నేరుగా ఇండోర్ వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఓ హోటల్లో రూమ్ తీసుకుని.. ప్రియుడిని అక్కడికి రప్పించుకుందని తెలుస్తోంది. భర్తను చంపిన భయం లేకుండా.. ఆ గదిలో వాళ్లిద్దరూ ఏకాంతంగా గడిపారని అంటున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవాలని ప్లాన్ చేశారు. ఓ ట్యాక్సీ బుక్ చేసి సోనమ్ను యూపీకి పంపించి.. ఆమె ఓ దాబాలో చిక్కుకున్నట్టు డ్రామా క్రియేట్ చేశారని.. కేసును తప్పుదారి పట్టించేందుకే ఇలా చేశారని భావిస్తున్నారు.
అంతా తల్లే చేసిందా?
ఇక, పెళ్లికి ముందే సోనమ్, రాజ్ కుశ్వాహా ఎఫైర్ గురించి ఆమె తల్లికి తెలుసని పోలీసులు గుర్తించారు. తాను రఘువంశీని పెళ్లి చేసుకోనని చెప్పినా.. సోనమ్ తల్లే బలవంతంగా కూతురును ఒప్పించినట్టు వెల్లడైంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా.. ఆ తర్వాత రఘువంశీని ఏం చేస్తానో నాకే తెలీదంటూ.. ఆనాడే తల్లికి సోనమ్ వార్నింగ్ ఇచ్చిందని కూడా తెలుస్తోంది. పెళ్లి తర్వాత ఏవో సాకులు చెప్పి.. ఫస్ట్ నైట్ను ఎలాగోలా పోస్ట్పోన్ చేసుకున్న సోనమ్.. నాలుగు రోజులకే పుట్టింటికి వచ్చేసింది. అప్పుడే తన లవర్ రాజ్ కుశ్వాహాతో మాట్లాడి.. హనీమూన్ మర్డర్ ప్లాన్కు కుట్ర చేశారని పోలీస్ విచారణలో క్లారిటీ వస్తోంది.
అన్నా అన్నా అంటూనే రాజ్తో సోనమ్ ఎంత పని చేసింది? చెల్లి అంటూ రాఖీ కట్టి వాడెంత తెగించాడు? ఎటు పోతోంది సమాజం? ఏం చేస్తోంది యువతరం?