International Condom Day: మిజోరంలో హెచ్ఐవీ కేసులు ప్రమాదకరంగా పెరుగుతుండటంపై ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లాల్రిన్పుయి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కాండోమ్ దినోత్సవం సందర్భంగా మిజోరం స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వహించిన ‘జస్ట్ యూజ్ ఇట్’ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలోని మొత్తం హెచ్ఐవీ కేసుల్లో 70 శాతం కేవలం లైంగిక సంబంధాల వల్లే వ్యాపిస్తున్నాయని వెల్లడించిన ఆమె, ఈ పరిస్థితి మిజో సమాజానికి ఒక సామూహిక అవమానం అని పేర్కొన్నారు. జాతీయ సగటు కంటే మిజోరం అత్యధిక స్థాయిలో ఉండటం తక్షణ చర్యల అవసరాన్ని సూచిస్తోందని ఆమె హెచ్చరించారు.
హెచ్ఐవీ వ్యాప్తికి గల కారణాలను విశ్లేషిస్తూ, దేశవ్యాప్తంగా హెచ్ఐవీ ప్రాబల్యం 0.2 శాతం ఉండగా, మిజోరంలో అది 2.74 శాతంగా ఉండటం ఆందోళనకరమని మంత్రి తెలిపారు. వివాహేతర సంబంధాలు, సరైన అవగాహన లేకపోవడం మరియు నివారణ చర్యలు తీసుకోకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ధోరణి మిజో సమాజం పాటిస్తున్న మతపరమైన విలువలకు విరుద్ధమని గుర్తు చేస్తూ, యువత తమ సంబంధాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా సురక్షితమైన లైంగిక జీవితం కోసం కండోమ్ల వినియోగం అత్యంత అవసరమని, దీనిపై ఉన్న అపోహలను వీడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
హెచ్ఐవీ నివారణ కోసం మిజోరం ప్రభుత్వం లవ్ బ్రిగేడ్ 2.0 అనే వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా, ప్రత్యేకమైన జాకెట్లు ధరించిన టూ-వీలర్ టాక్సీ డ్రైవర్లు ఎల్లప్పుడూ ఉచితంగా కండోమ్లను తమ వద్ద ఉంచుకుంటారు. ఎవరికైనా అవసరమైతే ఎటువంటి సంకోచం లేకుండా వారి నుండి వీటిని తీసుకోవచ్చు. నివారణ చర్యలు విఫలమైనప్పుడే హెచ్ఐవీ వ్యాప్తి చెందుతుందని, కండోమ్లు అందుబాటులో లేవనే కారణంతో ఎవరూ రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.