Modi : గుజరాత్ రెండో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో గాంధీనగర్లోని రైసన్ ప్రాంతంలో ఉంటున్న తన తల్లి హీరాబెన్ నివాసానికి వెళ్లారు. ఆమె కాళ్లకు నమస్కరించారు. తనయుడిని హీరాబెన్ ఆశీర్వదించారు. 45 నిమిషాలపాటు తన మాతృమూర్తితోనే గడిపారు మోదీ. ఇంట్లో సోఫాలో కూర్చొని తల్లితో మోదీ మచ్చటించారు. అనంతరం గాంధీనగర్లోని బీజేపీ కార్యాలయానికి చేరుకున్న ప్రధానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ స్వాగతం పలికారు.
అహ్మదాబాద్లోని రనిప్ ప్రాంతంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ఓటు హక్కు వినియోగించుకుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నారన్పూర్ ప్రాంతంలోని మున్సిపల్ సబ్ జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేస్తారు.
గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. డిసెంబర్ 1న 89 నియోజకవర్గాల్లో తొలి విడతలో పోలింగ్ జరిగింది. తొలి దశలో 63.31 శాతం పోలింగ్ నమోదైంది. డిసెంబర్ 5న 93 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. గుజరాత్ ఈ సారి బీజేపీ, కాంగ్రెస్ , ఆప్ మధ్య ముక్కోణపు పోరు నడుస్తోంది. వరుసగా ఏడోసారి విజయం సాధించాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవడానికి కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. పంజాబ్ తరహాలో సంచలన విజయం నమోదు చేయాలని ఆప్ ఆరాటపడుతోంది. మరి గుజరాత్ ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపారో చూడాలిమరి. గుజరాత్ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి.