Bihar NDA Government: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. ఎన్డీఏ కూటమి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా జేడీయూ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఎల్పీజేపి అధినేత చిరాగ్ పాశ్వాన్ మధ్య జరిగిన కీలక భేటీతో బీహార్ రాజకీయాలను మరింత ఉత్కంఠకరంగా మార్చింది.
సమాచారం ప్రకారం, నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రస్తుత బీహార్ క్యాబినెట్ రేపు సమావేశం కానుంది. ఈ సమావేశం అనంతరం సీఎం నితీష్ కుమార్, మంత్రివర్గ సభ్యులు తమ రాజీనామాలను బీహార్ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్కు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు దారులు తెరుచుకోనున్నాయి.
ఎన్డీఏలో ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతున్న కారణంగా, ఇప్పటికే అన్ని కీలక నేతలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారైన వెంటనే గవర్నర్ను కలిసి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరనున్నారు.
ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఎన్డీఏ అంతర్గతంగా చర్చలు జరిగినట్లు తెలుస్తున్నప్పటికీ, జెడీయూ సీనియర్ నేత, కేంద్ర మంత్రి లలన్ సింగ్ అయితే స్పష్టమైన ప్రకటన చేశారు.
సీఎం కుర్చీ ఖాళీ లేదు.. నితీష్ జీనే ముఖ్యమంత్రి” అని ఆయన వ్యాఖ్యానించడంతో నితీష్ కుమార్ తిరిగి అధికారంలోకి వస్తారనే సంకేతాలు స్పష్టమయ్యాయి. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోవడంతో ఆసక్తి మరింత పెరిగింది.
బీహార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం నవంబర్ 19 లేదా 20న నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందుతోంది. ఖచ్చితమైన తేదీ ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఫైనల్ అయిన తరువాత అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి నేతలు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ స్థాయి భాగస్వామ్యం బీహార్లో ఏర్పడనున్న ప్రభుత్వానికి ఎన్డీఏ ఇచ్చే ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తోంది.