NEET Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యావ్యవస్థలోని లోపాలపై, ముఖ్యంగా నీట్ వ్యవహారంపై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనకు మద్దతుగా సిజెపి ప్రతినిధులు, మద్దతుదారులు కీలక డిమాండ్లతో కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఇటీవల ఒక లేఖను సమర్పించారు. దేశవ్యాప్తంగా విద్యావేత్తలు, విద్యార్థులతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు అందులో పేర్కొన్నారు.
ప్రభుత్వ స్పందన – చర్చల ప్రయత్నం
సమస్య తీవ్రతను గుర్తించి, ఇరుపక్షాలకు ప్రయోజనకరమైన పరిష్కారం కనుగొనడానికి ప్రభుత్వం చూపుతున్న ఆసక్తిని నిరసనకారులు గుర్తించారు. అయితే, పరిష్కారం కేవలం మాటలకే పరిమితం కాకుండా, బాధిత విద్యార్థులకు ఆచరణాత్మకమైన న్యాయం జరిగేలా ఉండాలని వారు స్పష్టం చేస్తున్నారు.
ప్రధానమైన రాజీపడని డిమాండ్లు
గత కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నవారితో, దేశవ్యాప్త మద్దతుదారులతో చర్చించిన తర్వాత కొన్ని కీలక అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని.. నీట్ బాధితులకు రూ. కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ఎలాంటి చట్టపరమైన కేసులు నమోదు చేయకూడదని లేఖలో గట్టిగా కోరారు.
బహిరంగ క్షమాపణలకు పట్టు
ఆందోళన సమయంలో భద్రతా బలగాలు విద్యార్థులపై ప్రయోగించిన బలప్రయోగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దెబ్బలు తిన్న విద్యార్థులకు భారత ప్రభుత్వం, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అధిపతి, ఢిల్లీ పోలీస్ కమిషనర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే హెచ్చరిక
ఈ డిమాండ్లను ప్రభుత్వం వీలైనంత త్వరగా ఆమోదించాలని సీజేపీ కోరింది. ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే, ప్రస్తుతం ఢిల్లీకే పరిమితమైన ఈ ఉద్యమం రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తరిస్తుందని హెచ్చరించారు.
విద్యా సంస్కరణలపై ఐదు సూత్రాల పత్రం
దీనితో పాటు, విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన బృహత్తర నిర్మాణాత్మక మార్పుల కోసం ‘ఐదు సూత్రాల డిమాండ్ల పత్రం’ను కూడా ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై ప్రభుత్వం త్వరితగతిన స్పందించి, పారదర్శకమైన విద్యా వ్యవస్థను అందుబాటులోకి తేవాలని నిరసనకారులు ఆశిస్తున్నారు.