Pahalgam Attack Update : ఆ వీడియోను ఇప్పటికే చూసుంటారు. బైసరన్ పచ్చిక బయళ్లలో రిషి భట్ అనే టూరిస్ట్ జిప్లైన్లో జారుతూ తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. అతనలా గాల్లో తేలిపోతున్న సమయంలోనే.. కింద మైదానంలో ఉగ్రవాదులు హిందువులపై కాల్పులు జరుపుతుంటారు. ఆ వీడియోలో జిప్లైన్ ఆపరేటర్ తీరు అనేక అనుమానాలకు కారణమవుతోంది. రిషి భట్ను పంపే ముందూ.. అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేశాడు ఆ ఆపరేటర్. సరిగ్గా అదే టైమ్లో ఉగ్రవాదులు గన్ ఫైర్ ఓపెన్ చేశారు. టెర్రరిస్టులు సైతం అల్లాహో అక్బర్ అంటూనే కాల్పులు జరిపారు. అంటే, ఆ జిప్లైన్ ఆపరేటర్కు ఉగ్రదాడి గురించి ముందే తెలుసా? అతను ముష్కరులకు సహకరించాడా? వాళ్ల వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఇలా ఆ జిప్ లైన్ ఆపరేటర్ను అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో ప్రశ్నిస్తోంది NIA.
ప్లాన్ చేసి.. కాపు కాసి..
మరోవైపు, పహల్గాం ఉగ్రదాడిపై NIA విచారణను స్పీడప్ చేసింది. ఘటన జరిగిన రోజు.. బైసరన్ వ్యాలీకి మొత్తం నలుగురు ఉగ్రవాదులు వచ్చారు. అందులో ఒక టెర్రరిస్టు అడవిలో దాక్కొని.. మిగతా ముగ్గురికి రక్షణగా, స్టాండ్ బై ఉన్నాడు. ఇద్దరు ఉగ్రవాదులు బైసరన్ వ్యాలీ ఎంట్రీ గేట్ దగ్గర, ఇంకొకడు ఎగ్జిట్ గేట్ దగ్గర కాల్పులకు తెగబడ్డారు. మొదట ఎగ్జిట్ గేటు దగ్గర ఉన్న ఉగ్రవాది ఫైరింగ్ చేశాడు. కాల్పుల భయంతో పర్యాటకులంతా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఎంట్రీ గేటు వైపు పరుగులు తీశారు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న ఇద్దరు టెర్రరిస్టులు.. వారందరినీ ఒక్కచోట చేర్చారు. హిందువులు, ముస్లింలను వేరు చేశారు. ఐడీ కార్డులు చూశారు. కల్మా చదవమన్నారు. హిందువులేనని కన్ఫామ్ చేసుకున్న వారిని.. నేరుగా నుదిటిపై కాల్చి చంపారు. బైసరన్ వ్యాలీలో రక్తపాతం సృష్టించారు.
వర్షం వారిని కాపాడింది..
అయితే, అంతకు రెండు రోజుల ముందే ఉగ్రవాదులు దాడి చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కానీ, ఆ రోజు సడెన్గా వర్షం పడటంతో టూరిస్టులు తక్కువ సంఖ్యలో రావడంతో దాడిని వాయిదా వేసుకున్నట్టు ఎన్ఐఏ విచారణలో వెల్లడవుతోంది. దాడి జరిగిన రోజు.. ఆ నలుగురు టెర్రరిస్టులుఅక్కడే ఓ ఫుడ్కోర్టులో కూర్చుని పర్యాటకుల సంఖ్య పెరిగే వరకు వెయిట్ చేశారట. అంతా ఓకే అనుకున్నాకే మారణహోమానికి తెగబడ్డారు.
ఏడాదిన్నరగా కశ్మీర్లోనే..
ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులు దాదాపు ఏడిదిన్నర క్రితమే సరిహద్దులు దాటొచ్చి భారత్లో చొరబడినట్టు గుర్తించారు. గతేడాది సోన్మార్గ్లో ఏడుగురిని ఈ ఉగ్రవాదులే హత్య చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పక్కా ప్లాన్తో ఏప్రిల్ మొదటి వారంలోనే బైసరన్కు వచ్చారు. వారం పాటు అక్కడి పర్యాటక ప్రాంతాలు, హోటళ్లలో రెక్కీ చేశారు. ఆ మేరకు ఆ ప్రాంతంలోని సీసీకెమెరాల ఫుటేజ్ మొత్తాన్ని సేకరించి స్టడీ చేస్తోంది NIA. బైసరన్ వ్యాలీలో ఆరుగురు NIA అధికారులు, ఇద్దరు FSL మెంబర్లు సీన్ రీక్రియేట్ చేశారు. 45 మంది దుకాణాదారుల నుంచి వివరాలు ఆరా తీశారు. టెర్రరిస్టులు మొబైల్ పెయిడ్ అప్లికేషన్ యూజ్ చేసినట్టు గుర్తించారు. జిప్లైన్ ఆపరేటర్ను అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జిప్ లైన్లో వేలాడిన రిషి భట్ వీడియోను కీలక ఆధారంగా భావిస్తోంది ఎన్ఐఏ.
అతను సేఫేనా?
ఇంతకీ, జిప్ లైన్లో ఎంజాయ్ చేసిన ఆ రిషి భట్ పరిస్థితి ఏంటి? అతన్నీ కూడా ఉగ్రవాదులు కాల్చేశారా? ఉగ్రదాడి నుంచి తప్పించుకున్నాడా? అనే డౌట్ చాలామందికే వస్తోంది. రిషి భట్ క్షేమంగానే ఉన్నారు. జిప్ లైన్ నుంచి స్టార్ట్ అయిన కాసేపటికే గన్ ఫైర్ సౌండ్ వినిపించి బెదిరిపోయాడట. వెంటనే 15 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకేశాడు. భార్యాపిల్లలను తీసుకుని పరుగులు పెట్టాడు. ఓ చాటు ప్రదేశంలో దాక్కున్నాడట. వాళ్లు దాక్కున ప్లేస్కు కాస్త ముందే ఉగ్రవాదులు కొందరిని కాల్చి చంపారని రిషి భట్ చెప్పాడు. కాల్పుల సౌండ్ పూర్తిగా ఆగిపోయాక.. వ్యాలీ గేట్ దగ్గరికి వెళ్లామని.. అప్పటికి అక్కడ ఎవరూ లేరని అన్నాడు. 25 నిమిషాల త్వాత భద్రతా బలగాలు అక్కడికి వచ్చాయని తెలిపాడు.