Parliament Winter Session: ప్రధాని మోదీ పార్లమెంట్ ను హైజాక్ చేశారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ స్పందిస్తూ..”ప్రధానమంత్రి మోదీ భారత పార్లమెంట్ ను హైజాక్ చేశారు. రాజకీయ పార్టీలు లేవనెత్తిన ఏ ప్రధాన సమస్యలకూ ప్రధాని బాధ్యత వహించాలని కోరుకోవడం లేదు” అని అన్నారు.
ఫ్లోర్ లీడర్ల సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు భారత ఎన్నికల వ్యవస్థపై చర్చించాలని కోరగా బీజేపీ చర్చను తిరస్కరిస్తోందని ఎంపీ గొగోయ్ అన్నారు. “ఫ్లోర్ లీడర్ల సమావేశంలో, ప్రతిపక్షానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలు భారత ఎన్నికల వ్యవస్థపై చర్చించాలనుకున్నాయి. అయినప్పటికీ బీజేపీ ఈ వారం పార్లమెంటు ఎజెండాలో ఆ చర్చను జాబితా చేయడానికి నిరాకరిస్తోంది. రాజకీయ పార్టీలు పార్లమెంట్ పాలక, ప్రతిపక్షాల ఎజెండాను ప్రతిబింబించాలని కోరుకుంటున్నాయి” అని ఆయన ఎక్స్ వేదిక పోస్టు పెట్టారు.
పార్లమెంట్ సమావేశాలకు ముందు కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్..కేంద్ర ప్రభుత్వంతో సహకరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, బీజేపీ వారి బిల్లులను ఆమోదించాలని మాత్రమే కోరుకుంటుందని, ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను చర్చించడానికి సిద్ధంగా లేదన్నారు. శీతాకాలపు సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదించాలనుకునే అన్ని బిల్లులకు కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రతిపక్షాల ఏకైక అభ్యర్థన కొన్ని అంశాలను లేవనెత్తడానికి అనుమతి ఇవ్వాలనే అన్నారు. ప్రతిపక్షాల లేవనెత్తిన అంశాలను కూడా ఎజెండాలో చేర్చాలన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం తమ బిల్లులను మాత్రమే ఆమోదించాలని కోరుకుంటుందని, ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చించడానికి అవకాశం లేదంటోందనన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పనిచేసే విధానం అలా కాదని ఆయన అన్నారు.
“ప్రతిపక్షాలు లేవనెత్తే సమస్యలను ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంటే, ఆ విషయాన్ని ప్రభుత్వం ఎజెండాలో స్పష్టం చేశాలి” అని ఎంపీ గొగోయ్ అన్నారు. ఓటర్ల జాబితాపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ లోక్సభలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే సమస్యను లేవనెత్తడానికి వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించానని అన్నారు.
Also Read: Renuka Chowdary: కరిచేవాళ్లు లోపలే ఉన్నారు.. పెంపుడు కుక్కతో పార్లమెంటులోకి రేణుకా చౌదరి
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం దేనిపైనా చర్చ జరపాలని కోరుకోవడం లేదన్నారు. అప్పుడు సభ ఎలా నడుస్తుంది? ప్రతిపక్షాలు అడిగే కనీసం ఒక్క ప్రశ్నకు అయినా సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వం అనుకోవడంలేదన్నారు. సర్ గురించి కాకపోతే, ఎన్నికల సంస్కరణలు లేదా ఏదైనా ఇతర అంశంపై చర్చించవచ్చు.. కానీ కేంద్రం ఏ అంశంపై చర్చించడానికి సిద్ధంగా లేదన్నారు. ప్రతి ఒక్కరూ వాతావరణాన్ని ఆస్వాదించాలని ప్రధాని కోరుతున్నారని, దిల్లీ ప్రజలు ఎలాంటి వాతావరణాన్ని ఆస్వాదించాలి? ఆయన కొంచెం బయట చూసి దేశంలో ఏమి జరుగుతుందో చూడాలని జోడించారు.