Komatireddy Venkat Reddy: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హైదరాబాద్- విజయవాడ హైవేపై జనవరి 8 నుండి వాహనాల రద్దీ ఎక్కువగా ఉండనుంది. ఈ మేరకు వాహనాల రద్దీ తగ్గేలా చూసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో ఎదురైనా అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రోజుకు సుమారు లక్ష వాహనాల ప్రయాణం సాగిస్తుండటంతో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
కేంద్ర మంత్రి గడ్కరీకి కోమటి రెడ్డి లేఖ:
ముఖ్యంగా ఎల్బీనగర్ నుండి వనస్థలిపురం, పనామా గోడౌన్, హయత్ నగర్,రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ అవ్వడానికి వీలు లేకుండా చూడాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. పండుగ రద్దీ ఉన్న రోజుల్లో లేన్లు మూయడం..అలాగే భారీ యంత్రాలతో పనులు చేయొద్దని అధికారులను ఆదేశించారు. అత్యవసరంగా చేయాల్సిన పనులు ట్రాఫిక్ తక్కువగా ఉండే టైమ్లోనూ రాత్రి వేళల్లో మాత్రమే చేయాలన్నారు. పండుగ మొదలుకావడానికి ముందే రోడ్లపై మట్టి, నిర్మాణ సామగ్రి, యంత్రాలను పూర్తిగా తొలగించాలన్నారు. హైవేలపై అన్ని లేన్లపైనా వాహనాల రాకపోకలకు అందుబాటులో ఉంచాలన్నారు. సంక్రాంతికి వెళ్లి,వచ్చే వాహనాలకు టోల్ వసూలు చేయొద్దని
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు.
ఇటు రోడ్డు పనులు జరుగుతున్న ప్రతి చోట ట్రాఫిక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎక్కడా ట్రాఫిక్కు అయోమయం కలిగించేలా ఉండకూడదన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు, టోల్ ప్లాజాలు, కీలక ప్రాంతాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలని ఆదేశించారు. అన్ని సంబంధిత శాఖలు పోలీసుల సూచనలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. అలాగే పేట్రోల్ వెహికల్స్, క్రేన్లు, అంబులెన్సులు 24 గంటలు అందుబాటులో ఉంచాలని సూచించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అన్ని హైవే ఘటనలను కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు సజావుగా వెళ్లేలా అదనపు బృందాలను మోహరించాలని సూచించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
ALSO READ: Khammam News: ఖమ్మం జిల్లాలో వింత ఘటన.. కోడి పుంజుకు అంత్యక్రియలు