Capital Dome: దేశ రాజధాని ఢిల్లీ గగనతలాన్ని శత్రువుల కంటపడకుండా, ఎలాంటి వైమానిక దాడులకైనా తలొగ్గకుండా ఉండేందుకు భారత్ కీలక ముందడుగు వేసింది. ఢిల్లీ వాసులకు రక్షణ కల్పించేందుకు ‘క్యాపిటల్ డోమ్’ (Capital Dome) పేరుతో పిలిచే అత్యాధునిక బహుళ అంచెల వాయు రక్షణ వ్యవస్థను మోహరించనుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) చుట్టూ ఒక అభేద్యమైన రక్షణ వలయాన్ని సృష్టించడమే దీని లక్ష్యం. విదేశీ వ్యవస్థలపై ఆధారపడకుండా, పూర్తిగా డీఆర్డీవో (DRDO) అభివృద్ధి చేసిన స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందిస్తున్నారు. ఇది 24 గంటల పాటు బాహ్య దాడులతో పాటు, అంతర్గతంగా వచ్చే ముప్పులను కూడా పసిగడుతుంది.
ఈ రక్షణ వలయంలో రెండు ప్రధాన క్షిపణి వ్యవస్థలు ఉంటాయి. QRSAM (క్విక్ రియాక్షన్ మిసైల్) వాహనాలపై ఉండి కదులుతూనే లక్ష్యాలను గుర్తిస్తుంది. 25-30 కి.మీ పరిధిలో వచ్చే క్రూయిజ్ మిసైళ్లు, ఫైటర్ జెట్లను క్షణాల్లో అడ్డుకుంటుంది. VL-SRSAM నిలువుగా ప్రయోగించే వ్యవస్థ. 360 డిగ్రీల కోణంలో ఎటువైపు నుంచి ముప్పు వచ్చినా ఎదుర్కోగలదు. ఢిల్లీ వంటి నగరాలకు ఇది అత్యంత అనుకూలం.
ప్రస్తుతం డ్రోన్ల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో, వాటికోసం ఖరీదైన క్షిపణులను వాడకుండా ‘డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్’ (DEWs)ను ఇందులో అమర్చారు. ఇవి హై-ఎనర్జీ లేజర్లతో కాంతి వేగంతో ప్రయాణించి డ్రోన్లను గాలిలోనే కాల్చివేస్తాయి. దీనివల్ల నగరంలో ఎలాంటి విధ్వంసం జరగకుండా ఉంటుంది. రాడార్లు, సెన్సార్లతో అనుసంధానించబడిన కమాండ్ సెంటర్ ద్వారా ఈ ‘క్యాపిటల్ డోమ్’ పనిచేస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే ఢిల్లీ అత్యంత సురక్షితమైన నగరంగా మారుతుంది.
అమెరికా (NASAMS), ఇజ్రాయెల్ (ఐరన్ డోమ్), రష్యా (S-500), చైనా, దక్షిణ కొరియాలు ఇప్పటికే తమ రాజధానులకు పటిష్టమైన వాయు రక్షణ కవచాలను ఏర్పాటు చేసుకున్నాయి. వీటి స్ఫూర్తితోనే భారత్ కూడా ఢిల్లీ రక్షణ కోసం ‘క్యాపిటల్ డోమ్’ను సిద్ధం చేస్తోంది. డీఆర్డీవో స్వదేశీ పరిజ్ఞానంతో ఆకాశ్, QRSAM క్షిపణులు, లేజర్ వెపన్స్ను మేళవించి ఈ బహుళ అంచెల వ్యవస్థను రూపొందిస్తోంది. ఇది శత్రువుల డ్రోన్లు, క్షిపణుల నుంచి ఢిల్లీకి 24 గంటల పూర్తి భద్రతనిస్తుంది.
Read Also: Most Gold mines: ఈ 7 దేశాల్లోనే వరల్డ్ బిగ్గెస్ట్ గోల్డ్ మైన్స్.. టాప్లో ఉన్న కంట్రీ ఏదో తెలుసా..?