Rahul on Electoral bonds: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్నాయి అధికార బీజేపీ-విపక్ష కాంగ్రెస్ పార్టీలు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోస్తున్నారు. హిస్టరీ బూజును బీజేపీ పైకి తీస్తుండగా, పదేళ్లలో మోదీ సర్కార్ చేపట్టిన స్కీమ్స్ ని కాంగ్రెస్ బయటపెడుతోంది. అందులో ముఖ్యమైనది ఎలక్టోరల్ బాండ్లు స్కీమ్. కామన్మేన్ నుంచి బిజినెస్మేన్ వరకు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు మోదీ సర్కార్ తీసుకొచ్చిన సీక్రెట్ స్కీమ్ ఎలక్టోరల్ బాండ్స్.
ఎన్నికల బాండ్ల వ్యవహారంపై రచ్చ కంటిన్యూ అవుతోంది. ఎన్నికల కోడ్ రాకముందు నుంచి ఈ వ్యవహారంపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతీ సభలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ. ఇది ముమ్మాటికీ బిగ్గెస్ట్ కరప్షన్గా వర్ణిస్తున్నారు. కొంత మంది వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు తీసుకొచ్చిన పథకంగా వర్ణించారాయన.
మంగళవారం కేరళలోని కోజికోడ్, మలప్పురం, వయనాడ్ సభల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు రాహుల్. ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్గా ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూల్లోనూ ప్రధాని ఎన్నికల బాండ్ల వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల బాండ్లు రద్దు చేస్తే.. దేశంలోని మళ్లీ బ్లాక్మనీ వస్తుందని ప్రధాని మోదీ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. వీధుల్లో కొంతమంది బెదిరింపులకు పాల్పడతారని, కానీ మోదీ సర్కార్ మాత్రం దీన్ని ఎన్నికల బాండ్లుగా పిలుస్తోందన్నారు.
ఈ విషయంలో బీజేపీ సర్కార్ కొత్త పద్దతుల్లో వ్యాపారవేత్తలను బెదిరిస్తోందని దుయ్యబట్టారు రాహుల్ గాంధీ. ఈ వ్యాపారాన్ని అదానీకి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నిచారు. సముద్రం కింద పూజలు చేయడం, కొన్నిసార్లు భారతదేశానికి ఒలింపిక్స్ టోర్నమెంట్ను తీసుకొస్తానని, మరికొన్నిసార్లు చందమామ పైకి మనిషిని పంపతామని చెబుతారుగానీ, దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగం, ధరల పెరుగుదల గురించి ఎందుకు నోరుఎత్తరని ప్రశ్నించారు రాహుల్గాంధీ. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి రాజ్యాంగాన్ని మార్చాలని ప్లాన్ చేస్తున్నాయని దుయ్యబట్టారు. కానీ ఇండియా కూటమి మాత్రం రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చి ఇండియన్ ఆర్మీని కించపరిచారని ఆందోళన వ్యక్తంచేశారు.
ALSO READ: విరుదునగర్ గాలి ఎటు, ఎవరి సొంతం?
దీనిపై రియాక్ట్ అయ్యారు కేంద్రమంత్రి, తిరువనంతపురం బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్. అవినీతి గురించి మాట్లాడే వ్యక్తుల్లో రాహుల్ చివరి వ్యక్తి కావచ్చన్నారు. బీఫోర్స్ మాకు తెలుసని, ఆ ఫ్యామిలీకి సంబంధించిన కుంభకోణాల గురించి అంతా తెలుసన్నారు. మరి బాండ్ల వ్యవహారానికి ఎప్పుడు పుల్స్టాప్ పడుతుందో చూడాలి.