Manickam tagore vs Radhika: లోక్సభ ఎన్నికల్లో ఈసారి చాలామంది నటీనటులు బీజేపీ నుంచి బరి లోకి దిగుతున్నారు. హేమామాలిని, కంగనా, రాధిక వంటి హేమాహేమీలు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హేమామాలిని తప్పితే మిగతా ఇద్దరు లోక్సభలో అడుగుపెట్టాలని ఉవ్విల్లూరు తున్నారు.
తమిళనాడు నుంచి నటి రాధిక తొలిసారి బరిలోకి దిగారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ను ఢీకొంటున్నారు. హ్యాట్రిక్ కొట్టాలని మాణిక్కం భావిస్తుండగా, ఇక్కడి నుంచి బీజేపీ జెండా ఎగురవేయాలని రాధిక ఉన్నారు. డీఎండీకె తరపున విజయకాంత్ కొడుకు విజయ ప్రభాకర్ పోటీలో ఉన్నారు. మిగతా పార్టీలున్నా ఉన్నా.. ముఖ్యంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోరుగానే అక్కడి ప్రజలు భావిస్తున్నారు.
విరుదునగర్ నియోజకవర్గానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి వచ్చిన నేతలు తమిళనాడు ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఇక్కడి నుంచి రెండుసార్లు గెలుపొందారు కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మాణిక్కం ఠాగూర్. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్నది ఆయన ఆలోచన. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలను రెడీ చేశారు. అయితే ఠాగూర్కు గట్టి ప్రత్యర్థి లేకపోవడంతో విజయం సునాయాశమేనని ఆ పార్టీ నేతల మాట. దీనికితోడు అధికార డీఎంకె మద్దతు కూడా కాంగ్రెస్ కలిసిరానుంది. ప్రచారంలో తనదైనశైలిలో దూసుకుపోయారు మాణిక్కం ఠాగూర్.
నటుడు శరత్కుమార్ సహాయంతో రాధిక కూడా ప్రచారం చేశారు. కాకపోతే ఆమెకి మద్దతుగా బీజేపీ ముఖ్యనేతలు రంగంలోకి దిగకపోవడం, ఓటర్లను ఆకట్టుకోకపోవడంలో కాస్త వెనుకంజ వేశారని అంటున్నారు. మోదీ ఛరిష్మా, సినీ గ్లామర్ ఈ రెండింటిపైనే రాధిక ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ ముఖ్యనేతలు వారానికి ఒకరు వచ్చి ప్రచారం చేస్తున్నారు. డీఎండీకె తరపున దివంగత విజయ్కుమార్ కుమారుడు విజయ ప్రభాకర్ బరిలో ఉన్నారు. తాను గెలిస్తే ఇక్కడే మకాం పెడతానని ప్రచారంలో ఊదరగొట్టారు. నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి కౌసిక్ యువతను ఆకట్టుకునే పనిలో పడ్డారు. కీలకమైన అభ్యర్థులు నలుగురు ఉన్నా, ఇక్కడ ద్విముఖ పోటీగానే వర్ణిస్తున్నారు.
ALSO READ: నేటితో తొలివిడత ఎన్నికల ప్రచారానికి తెర.. ఎల్లుండే పోలింగ్
విరుదునగర్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎనిమిది కులాలదే ఆధిపత్యం. ఇందులో కనీసం నాలుగు కులాలను తమవైపు తిప్పుకున్నా వాళ్లు విజయం సాధించడం తేలికన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ముక్కులత్తోర్, నాయక్కర్, నాడార్, ఆది ద్రవిడర్, మూప్పర్, సెట్టియార్, రెట్టియార్, పిళ్లైమార్ కమ్యూనిటీలదే హవా. ఈసారి ఆయా కులాలు ఎటువైపు మొగ్గుచూపుతాయో చూడాలి.