Sharad Pawar: ఎన్సీపీలో మూడు రోజులుగా జరుగుతున్న హైడ్రామాకు తెరపడింది. రాజీనామాపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శరద్ పవార్ ప్రకటించారు. కోర్ కమిటీ నిర్ణయం మేరకు.. మనస్సు మార్చుకున్నట్లు స్పష్టం చేశారు. కార్యకర్తల ప్రేమ, అభిమానం, నమ్మకం తనను కదిలించాయని.. కార్యకర్తల సెంటిమెంట్ను కాదనలేనన్నారు. ముందు ముందు మరింత ఉత్సాహంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. పవార్ నిర్ణయంపై పార్టీ క్యాడర్ సంబరాల్లో మునిగిపోయింది.
రాజకీయ కురవృద్ధుడు.. దేశరాజకీయాల్లో కీలక నేత అయిన శరద్ పవార్.. మంగళవారం తన ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా.. అనూహ్యంగా రాజీనామా నిర్ణయం ప్రకటించారు. దీంతో క్యాడర్ అంతా షాక్ కు గురైంది. రాజీనామా వద్దంటూ చాలామంది కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయినా పవార్ తన మనస్సు మార్చుకోలేదు. తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోవాలంటూ పవార్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
అయితే పవార్ రాజీనామాతో తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. పవార్ కూతురు సుప్రియా సూలే, లేదా ఆయన మేనల్లుడు అజిత్ పవార్ నెక్ట్స్ ఎన్సీపీ చీఫ్ అనే కథనాలు వెలువడ్డాయి. వీరే కాకుండా.. ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్ బల్ పేర్లు కూడా వినిపించాయి. పార్టీ జాతీయ అధ్యక్ష స్థానంలో కూతురు సుప్రియా సూలే, రాష్ట్ర పార్టీకి చీఫ్ గా అజిత్ పవార్ ఉంటారని జాతీయ మీడియాలో కథనాలు ప్రచురించాయి. అయితే కమిటీ మాత్రం.. పవార్ రాజీనామాను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలోనే శరద్ పవార్ రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. తాజా నిర్ణయంతో.. ఎన్సీపీ బాధ్యతలను శరద్ పవారే నిర్వహించనున్నారు. అయితే శరద్ పవార్ స్టేట్ మెంట్ ఇచ్చే సమయంలో.. అక్కడ అజిత్ పవార్ కనిపించకపోవడం సంచలనంగా మారింది. వాస్తవానికి అజిత్ పవార్.. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అది నచ్చకే శరద్ పవార్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారని.. పార్టీ మొత్తం తనకు మద్దతుగా నిలబడిందనే విషయం తెలియజేసేందుకే పవార్ రాజీనామా స్ట్రాటజీ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.