ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ ఏసీపీ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఆరు పేజీల సుదీర్ఘ లేఖను ఏసీపీకి పంపారు. పోలీసులు వ్యవహరించిన తీరు చట్టవిరుద్ధమని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా నంది నగర్లోని తన నివాసం గోడకు నోటీసులు అతికించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
లేఖలో కేసీఆర్ ప్రధానంగా చట్టపరమైన అంశాలను ప్రస్తావించారు. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులను సెక్షన్ 160 CrPC ప్రకారం వారి నివాసం వద్దే విచారించాలని చట్టం చెబుతోందని గుర్తు చేశారు. తాను ప్రస్తుతం ఎర్రవల్లిలో నివసిస్తున్నానని, అక్కడికే నోటీసులు పంపాలని గతంలోనే కోరినప్పటికీ, పోలీసులు కావాలనే నంది నగర్ చిరునామాను వాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్లోని చిరునామాకు, విచారణ నోటీసులకు సంబంధం లేదని అన్నారు. విచారణ సమయంలో వ్యక్తి ఎక్కడ ఉంటున్నారనేదే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. హరీష్ రావు విషయంలో ఒకలా, తన విషయంలో మరోలా పోలీసులు ‘డబుల్ స్టాండర్డ్స్’ పాటిస్తున్నారని విమర్శించారు.
సుప్రీంకోర్టు గతంలో ‘సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ’ కేసులో ఇచ్చిన తీర్పును కేసీఆర్ ఈ లేఖలో ఉటంకించారు. నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలని, గోడలకు అతికించడం లేదా ఇతర పద్ధతులు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని హెచ్చరించారు. అంతేకాకుండా, జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని, చట్టపరంగా ఆ నోటీసులను తాను విస్మరించవచ్చని కూడా పేర్కొన్నారు.
అయితే.. చట్టపరమైన లోపాలు ఎన్ని ఉన్నప్పటికీ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని కేసీఆర్ ప్రకటించారు. పోలీసులు పట్టుబట్టిన విధంగానే ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నంది నగర్ నివాసంలో విచారణకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మాత్రం పద్ధతి మార్చుకోవాలని.. నోటీసులను ఎర్రవల్లి చిరునామాకే పంపాలని పోలీసులకు సూచించారు.
ALSO READ: CM Revanth: హార్వర్డ్ వేదికగా తెలంగాణ రైజింగ్.. విద్యార్థులకు సీఎం రేవంత్ కీలక సందేశం