Drugs Seized: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వేదికగా మరో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టును DRI అధికారులు గుట్టురట్టు చేశారు. బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు ₹9.5 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం జరిగిన ఈ మెరుపు దాడిలో మొత్తం ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారిపై ఎన్.డి.పి.ఎస్ (NDPS) చట్టం కింద కేసులు నమోదు చేశారు.
విశ్వసనీయ సమాచారంతో DRI హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో నిఘా పెట్టారు. బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్వేస్ విమానం (TG-329) లో వచ్చిన నలుగురు అంతర్జాతీయ ప్రయాణికులను అధికారులు అనుమానంతో తనిఖీ చేశారు. వారు వెంట తెచ్చుకున్న ట్రాలీ బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించగా.. అందులో ప్యాకెట్ల రూపంలో దాచిన డ్రగ్స్ లభ్యమయ్యాయి. నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ కిట్ ద్వారా పరీక్షించగా.. అది నాణ్యమైన హైడ్రోపోనిక్ గంజాయిగా నిర్ధారణ అయ్యింది. అధికారులు మొత్తం 27.15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ అక్రమ రవాణాలో నేరుగా పాల్గొన్న నలుగురు ప్రయాణికులతో పాటు, విమానాశ్రయం వెలుపల వారి కోసం వేచి చూస్తున్న మరో ముగ్గురు సహచరులను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ముఠా బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? హైదరాబాద్లో ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరు? అనే కోణంలో అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ఇతర కీలక పత్రాల ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Also Read: రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తాం.. కుప్పం గడ్డపై ముఖ్యమంత్రి హామీ
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
రూ.9.5 కోట్లు విలువ చేసే 27.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం
బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ ప్రయాణికులతో సహా ఏడుగురు అరెస్ట్
NDPS చట్టం కింద కేసు నమోదు
At Shamshabad Airport, officials seized 27.15 kilograms of… pic.twitter.com/wKKruvg2t6
— BIG TV Breaking News (@bigtvtelugu) January 31, 2026