Divorce : విడాకుల మంజూరు అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో వారికి వెంటనే విడాకులు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. పరస్పర అంగీకారంతో దంపతులు విడిపోవాలనుకుంటే.. అందుకు 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. కొన్ని షరతులతో ఈ 6 నెలల నిరీక్షణ నిబంధనను సుప్రీంకోర్టు సడలించింది.
దంపతుల మధ్య వివాహ బంధం విచ్ఛినమైతే ఆర్టికల్ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగించుకుని సుప్రీంకోర్టు వారికి విడాకులు మంజూరు చేయొచ్చని ధర్మాసనం పేర్కొంది. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటే.. అందు కోసం 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని పేర్కొంది. కొన్ని షరతులతో ఈ తప్పనిసరి నిరీక్షణ గడువును ఎత్తివేయొచ్చునని జస్టిస్ SK కౌల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
కుటుంబ న్యాయస్థానాలకు రిఫర్ చేయకుండానే సుప్రీంకోర్టు నేరుగా విడాకులు మంజూరు చేసే అంశంపై చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. పరస్పరం ఇష్టపూర్వకంగా విడాకులు కోరుకునే దంపతుల విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 పరిధిలోని విస్తృత అధికారాలను వినియోగించుకునే వీలుందా అనే దానిపై విచారణ జరిపింది. 2016 జూన్ 29న ఈ పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. గతేడాది సెప్టెంబర్ లో తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా విడాకులపై కీలక తీర్పు వెలువరించింది.