Temple Property Donation 2025: తండ్రిని ప్రేమించని వారికి ఇంటిని ఎందుకు ఇవ్వాలనుకున్నాడు ఓ తండ్రి. ఆస్తి కోసం తలనొప్పులు తలెత్తిస్తే, ఆస్తినే ఒక ఊహించని దిశగా మలిచేశాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా పటవేడు గ్రామానికి చెందిన విజయన్ అనే 65 ఏళ్ల రిటైర్డ్ ఆర్మీ జవాన్ తాను సంపాదించిన ఆస్తిని తనకున్న రెండు ఇళ్లను.. తన కుటుంబానికి ఇవ్వకుండా, రేణుకాంబాల్ ఆలయానికి విరాళంగా ఇచ్చేశారు. ఈ నిర్ణయం కుటుంబ సభ్యులను, గ్రామస్థులను, అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
విజయన్ గతంలో భారత సైన్యంలో సేవలందించి, పదవీ విరమణ తర్వాత తన స్వగ్రామానికి వచ్చారు. బహుశా ప్రతి తండ్రిలాగే, తాను కష్టపడి సంపాదించినదాన్ని తన పిల్లలకు అందించాలని ఆశించారు. కాని కాలక్రమేణా ఆ ఆశలన్నీ పటాపంచలు అయ్యాయి. కుమార్తెలు తనపై ప్రేమను చూపించకుండా, ఆస్తి కోసం వాదనలు చేస్తూ, ఇంట్లో గొడవలు పెంచడంతో ఆయన మనసు తీవ్రంగా బాధపడింది.
2025 మే 2న ఉదయం, విజయన్ తన చేతిలో ఉన్న 2 ఇళ్ల డాక్యుమెంట్లను తీసుకుని, పక్కనే ఉన్న రేణుకాంబాల్ ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆలయ ధర్మకర్తలకు ఈ పత్రాలను అప్పగించి, ఇవన్నీ అమ్మవారికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. వాటిలో ఒకటి ఆలయం పక్కన ఉన్న రూ. 3 కోట్ల విలువైన రెండంతస్తుల భవనం, మరోది రూ. 1 కోటి విలువైన 1500 చదరపు అడుగుల ప్లాట్ పై నిర్మించిన ఇల్లు.
ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలియగానే, పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. భార్య కస్తూరి, కుమార్తెలు సుబ్బులక్ష్మి, రాజలక్ష్మిలు ఆలయానికి వచ్చి పెద్ద గొడవకు దిగారు. ఇది మా ఇంటి ఆస్తి.. మా అనుమతి లేకుండా ఆయన ఎలా ఇవ్వగలరు? అంటూ ఆలయ నిర్వాహకులను నిలదీశారు. పూజారులు, భక్తులు, స్థానికులు ఈ ఘటనను చూస్తూ నివ్వెరపోయారు.
Also Read: Vizag Metro first phase: విశాఖ మెట్రోకు అంతా రెడీ.. తొలి స్టేషన్ సిద్ధం.. ఎక్కడంటే?
అయితే ఆలయ అధికారులు మాత్రం ఘాటుగా స్పందించారు. విజయన్ పూర్తిగా స్వయంగా నిర్ణయం తీసుకుని, తమ ఆస్తిని ఆలయానికి అంకితం చేశారు. డాక్యుమెంట్లన్నీ లీగల్గా ఒప్పందాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ ఆస్తులు ఆలయానికి చెందినవే అని ఆలయ జాయింట్ కమిషనర్ సిలంబరసన్ స్పష్టం చేశారు.
విజయన్ తన నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ఆలయానికి చెప్పిన వివరాల ప్రకారం, నా జీవితంలో నేను దేశానికి సేవ చేశాను. నాతో ఉన్నది ఆస్తి కాదు, ఆత్మగౌరవం. నేను సంపాదించిన ఇంటిని నా పిల్లలు నన్ను గౌరవించకుండా కేవలం ఆస్తిగా మాత్రమే చూడడం బాధాకరం. అందుకే అమ్మవారికి సమర్పిస్తున్నానన్నారు.
ఇక న్యాయవాదులు మాత్రం ఈ విషయంలో ఒకే మాట చెబుతున్నారు. ఆస్తి విజయన్ పేరు మీద ఉంటే, ఆయనకు పూర్తి హక్కు ఉంది. కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లవచ్చు కానీ న్యాయపరంగా విజయన్ నిర్ణయం బలంగా ఉండే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.
ఈ సంఘటన తర్వాత గ్రామంలో పెద్ద చర్చే మొదలైంది. కొంతమంది విజయన్ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు కుటుంబాన్ని పక్కన పెట్టి తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. కానీ చాలా మంది మాత్రం, ‘‘ఆస్తి కోసం తండ్రిని బాధపెట్టడం దారుణం.. ఆయన కూడా పునరాలోచించి కుటుంబానికి మళ్లీ చాన్స్ ఇవ్వాలి అంటూ భావిస్తున్నారు.
ముఖ్యంగా యువత మాత్రం ఈ సంఘటనను చాలా గాథగా తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించినదాన్ని ప్రేమగా చూడాలి. కేవలం వారసత్వ హక్కు పేరుతో గొడవలు పెట్టడం ఎంతవరకు న్యాయసమ్మతం? అనే ప్రశ్నలు కురిపిస్తున్నారు.
మొత్తంగా చూస్తే, విజయన్ నిర్ణయం ఏకపక్షంగా అయినా, అది కుటుంబానికి గట్టి పాఠం చెప్పేలా ఉంది. ప్రేమను పంచితే ఆస్తి సహజంగా వస్తుంది. కానీ ఆస్తిని కోరి ప్రేమను విస్మరించితే, ఇదే పరిస్థితి రావొచ్చు. చివరికి, విజయన్ ఆస్తి ఆలయానికి రాసిచ్చి తన తీరుతో అందరికీ బుద్ధి చెప్పినట్టయ్యాడు.