Tax Hiked On Petrol: పశ్చిమాసియాలో పరిస్థితుల సాధారణ స్థాయికి చేరడంతో కేంద్రప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా పెట్రోల్పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎగుమతులపై ప్రత్యేక పన్ను విధించింది. జూలై ఒకటి అనగా నేటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి.
పెట్రోల్పై ప్రత్యేక పన్ను విధింపు.. నేటి నుంచి అమల్లోకి
పశ్చిమాసియా ఉద్రిక్తతలు నార్మల్ స్థితికి చేరింది. జలసంధి ద్వారా నౌక రాకపోకలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దేశీయ అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంధన ఎగుమతులపై నియంత్రణ కొనసాగించేందుకు విండ్ఫాల్ గెయిన్స్ టాక్స్లో మార్పులు చేసింది. ఈ మేరకు తాజా నోటిఫికేషన్ను విడుదల చేసింది ఆర్థికశాఖ. ఈ నిర్ణయాలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి.
కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం పెట్రోల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం విధించింది. లీటరుకు రూ.1.50 నుంచి రూ.4 కు పెంచింది. భారత్ నుంచి వివిధ విదేశాలకు పెట్రోల్ ఎగుమతి చేస్తే చమురు కంపెనీలు అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ సరఫరాను తగ్గించి విదేశాలకు ఎగుమతులు చేయకుండా అడ్డుకోవడం దీని వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు అంటున్నారు.
దేశీయంగా వాహనదారులపై ఎలాంటి భారం పడదు
అదే సమయంలో మరొక నిర్ణయం తీసుకుంది. డీజిల్, విమాన ఇంధన ఎగుమతుల విషయంలో చమురు శుద్ధి సంస్థలకు ఊరట ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను సమీక్షించిన ఆర్థికశాఖ, డీజిల్పై ఉన్న ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.14 నుంచి రూ.8.50కు కుదించింది.
విమానాల ఇంధనం ఏటీఎఫ్పై ఉన్న పన్నును రూ.12.50 నుంచి రూ.7.50కు తగ్గించింది. భారత రిఫైనరీలు ఎగుమతులకు రిలీఫ్ ఇచ్చింది. దీనివల్ల రిఫైనరీలకు లాభదాయక పరిస్థితులు ఏర్పడినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో దేశీయంగా విక్రయించే పెట్రోల్-డీజిల్ విషయంలో క్లారిటీ ఇచ్చింది.
ALSO READ: గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. సిలిండర్ల ధర రూ.183.50 తగ్గింపు, నేటి నుంచి అమల్లోకి
ప్రస్తుతం ఉన్న పన్నుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. వాహనదారులు ప్రస్తుతం చెల్లిస్తున్న ధరకు ఆయిల్ కొనుగోలు చేయవచ్చు. పన్ను పెంపు, తగ్గింపు అనేది కేవలం ఎగుమతులకే మాత్రమే. దేశీయ వినియోగదారులపై అదనపు భారం పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది కేంద్రప్రభుత్వం.