Telegram: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్పై భారత ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఈ యాప్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు, భారీ మోసాలకు అడ్డాగా మారిందన్న తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఐటీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ విచారణను చేపట్టాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఈ దర్యాప్తును సమన్వయం చేస్తోంది.
టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ను అడ్డంపెట్టుకుని నేరగాళ్లు వ్యవస్థీకృతంగా నేరాలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా, స్టాక్ మార్కెట్ సలహాల పేరుతో అమాయక ఇన్వెస్టర్లను మోసం చేయడం (Share Market Fraud), అక్రమంగా జూదం, బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించడం వంటివి పెరిగిపోయాయి. అంతేకాకుండా, నీట్ (NEET) వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేసి అమ్ముకోవడం, వ్యక్తులను బెదిరించి డబ్బు వసూలు చేయడం (Extortion) వంటి తీవ్రమైన నేరాలకు టెలిగ్రామ్ వేదికగా మారుతోందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
Read Also: Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో కీలక మలుపు.. ఎరుపు రంగు ఫోర్డ్ కారు స్వాధీనం
ఈ యాప్లో ఉండే ప్రైవసీ ఫీచర్లు, పెద్ద గ్రూపులను నడిపే సౌలభ్యం నేరగాళ్లకు వరంగా మారాయని భద్రతా ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫ్రాన్స్లో టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ (Pavel Durov) అరెస్ట్ అయిన కొద్ది రోజులకే భారత్లో కూడా ఈ యాప్పై దర్యాప్తు ముమ్మరం కావడం గమనార్హం. దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే, భారత ఐటీ నిబంధనలను పాటించని పక్షంలో టెలిగ్రామ్పై కఠిన చర్యలు, లేదా నిషేధం (Ban) విధించే అవకాశం కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.
చైనాలో 2015 నుండి టెలిగ్రామ్పై నిషేధం అమల్లో ఉంది. ఇది చైనా “గ్రేట్ ఫైర్వాల్” సెన్సార్షిప్లో భాగంగా ఉంది. ఇరాన్లో 2018 నుండి ఇక్కడ టెలిగ్రామ్ అధికారికంగా బ్లాక్ చేయబడింది. పాకిస్తాన్లో టెలిగ్రామ్ యాక్సెస్పై తరచుగా ఆంక్షలు విధిస్తుంది లేదా పూర్తిగా బ్లాక్ చేస్తుంది.క్యూబాలో 2021లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సమయంలో టెలిగ్రామ్తో సహా అనేక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేసింది.థాయిలాండ్ లో 2020లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు వాడారన్న కారణంగా టెలిగ్రామ్ను బ్యాన్ చేసింది. వియత్నాంలో కూడా ఈ యాప్పై ఆంక్షలు ఉన్నాయి.