Delhi Blast Update: ఢిల్లీ పేలుడు కేసుకు (Delhi Blast Case) సంబంధించిన దర్యాప్తులో ఫరీదాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిందని భావిస్తున్న ఒక ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును (Red Ford EcoSport) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్ DL 10 CK 0458 అని అధికారులు ధృవీకరించారు.
ఈ కారు ఫరీదాబాద్లోని ఖండవాలి గ్రామం సమీపంలో అనుమానాస్పద స్థితిలో పార్క్ చేసి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన దర్యాప్తు బృందాలు ఖండవాలి గ్రామానికి చేరుకుని కారును గుర్తించి, తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ కారు పేలుడు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉమర్ ఉన్ నబీ (Umar Un Nabi) పేరు మీద రిజిస్టర్ అయి ఉండవచ్చని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ కారును ఉపయోగించే నిందితులు సంఘటనా స్థలానికి వచ్చి ఉండవచ్చని లేదా పేలుడు అనంతరం తప్పించుకోవడానికి వాడి ఉండవచ్చని సందేహిస్తున్నారు. ఈ కారు నుంచి కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని, నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.
Read Also: Andhra Pradesh: గుంటూరులో ఇస్లామిక్ ఉగ్రవాదుల షెల్టర్.. ముంబై ఏటీఎస్ దాడులు
మరోవైపు ఢిల్లీ కారు పేలుడుకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది అరెస్టయ్యారు. మరో ముగ్గురు అనుమానితులను పోలీసులు ప్రశ్నించి విడిచిపెట్టారు. జమ్మూకశ్మీర్కు చెందిన ఆరిఫ్, యాసిర్, మసూద్, ఇర్ఫాన్, జమీర్, డాక్టర్ సజ్జద్ సహా మరో డాక్టర్, నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లను అరెస్టు చేశారు. జమ్మూకశ్మీర్కు చెందిన తారిఖ్, ఆమిర్, ఉమర్ను ప్రశ్నించిన పోలీసులు.. సహరన్పూర్ వాసి డాక్టర్ ఆదిల్ రాయిడర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఫరీదాబాద్కు చెందిన డా. మొజమ్మిల్ అహ్మద్, షహీన్ షాహిద్, లక్నోకు చెందిన డాక్టర్ పర్వీజ్ లను అరెస్టు చేసినట్లు సమాచారం.