Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి గడగడలాడుతున్నారు. ఆదివారం నమోదైన గణాంకాల ప్రకారం, ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సగటున 450 పాయింట్లు దాటి, ‘అత్యంత తీవ్రమైన’ (Severe Plus) కేటగిరీకి చేరుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సూచీ 500కు చేరువలో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటేసింది. ముఖ్యంగా భవనా ప్రాంతంలో అత్యధికంగా 497 పాయింట్ల AQI నమోదైంది. అలాగే నరేలాలో 492, ఓక్లా ఫేస్-2లో 472 పాయింట్లుగా గాలి నాణ్యత నమోదైంది. ఐటీవో, ఆనంద్ విహార్, సెంట్రల్ ఢిల్లీ, లోధి కాలనీ మరియు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాలు దట్టమైన పొగమంచు (Smog) తో నిండిపోయాయి. విజిబిలిటీ తగ్గడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాలుష్యం ‘అత్యంత తీవ్ర’ స్థాయికి చేరుకోవడంతో కేంద్ర వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) తక్షణమే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్-4 ఆంక్షలను అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా నగరంలోకి భారీ ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించారు. కేవలం నిత్యావసర వస్తువులను రవాణా చేసే వాహనాలు, ఎలక్ట్రిక్ మరియు సిఎన్జీ ట్రక్కులకు మాత్రమే అనుమతినిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే BS-4 డీజిల్ వాహనాలపై ప్రభుత్వం కఠిన నిషేధం విధించింది.
పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యం తగ్గే వరకు పాఠశాలలను ప్రత్యక్షంగా నిర్వహించకుండా, రేపటి నుంచి హైబ్రిడ్ విధానంలో (ఆన్లైన్ మరియు ఆఫ్లైన్) తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించి, పెద్ద తరగతుల వారికి ఆన్లైన్ బోధనను ప్రోత్సహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఆడుకోవడం, శారీరక శ్రమతో కూడిన పనులకు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత గాలి నాణ్యత ఆరోగ్యవంతులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇప్పటికే శ్వాసకోస సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎన్-95 మాస్కులు ధరించడం, అనవసరంగా బయటకు రాకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాతావరణంలో మార్పుల వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
ALSO READ: Crime News: హైదరాబాద్ నగరంలో దారుణ హత్య.. రౌడీషీటర్ అమీర్ను చంపిన దుండగులు!