Kalvakuntla Kavitha: బషీర్బాగ్లో నిర్వహించిన ప్రెస్మీట్లో జాగృతి అధ్యక్ష్యురాలు కల్వకుంట్ల కవిత.. హైదరాబాద్ నగర పరిస్థితిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి హృదయం హైదరాబాద్ సిటీయేనని గుర్తుచేసిన ఆమె, హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇవ్వాలన్న ప్రయత్నాలను తాము అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించి, హైదరాబాద్తో కూడిన తెలంగాణను సాధించుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారని, అంతటి నగరాన్ని పాలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు.
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని కవిత విమర్శించారు. గతంలో హైదరాబాద్లో 7 వేలకుపైగా సిటీ బస్సులు తిరిగేవని, కానీ ఉచిత బస్సు పథకం అమలు చేసిన తర్వాత వాటి సంఖ్యను కేవలం 3,500కు తగ్గించారని అన్నారు. ఫలితంగా నగరంలో సరైన ప్రజా రవాణా సౌకర్యాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు, వికలాంగులు రోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడాన్ని అడ్డుపెట్టుకుని, మొత్తం ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే ప్రయత్నం జరుగుతోందని రేవంత్రెడ్డి ప్రభుత్వంపై కవిత ఆరోపించారు. గతంలో సెట్విన్ సర్వీసులు ఉండేవని, అవి ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యాయని గుర్తుచేశారు. వికలాంగులు ఆర్టీసీ సేవలను వినియోగించుకునే పరిస్థితి కూడా లేదని అన్నారు.
హైదరాబాద్లో వీధి కుక్కల బెడద తీవ్రంగా పెరిగిందని, శానిటేషన్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని కవిత పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1,21,997 మందికి పైగా కుక్క కాట్లకు గురయ్యారని గణాంకాలు చెబుతున్నాయని వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా నగరంలో నేరాల రేటు పెరిగిపోయిందని, ముఖ్యంగా వృద్ధులు, ఒంటరిగా నివసించే వారిని లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నగరంలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిందని, డ్రగ్స్ తీసుకునే వారికి బాపు ఘాట్ అడ్డాగా మారిందని ఆమె ఆరోపించారు. సనత్నగర్ దాసరి బస్తీలో చెత్త వాహనాలు నిలిపి డ్రగ్స్ తీసుకుంటున్న పరిస్థితి ఉందని, ఆ ప్లాట్ను వెంటనే ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు.
యాకత్పురలో మంచినీరు, మురుగు నీరు కలిసిపోతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అక్కడి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కవిత అన్నారు. మానసిక ఆరోగ్య సేవలు అందిస్తున్న NIMH సేవలు అద్భుతంగా ఉన్నాయని, ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అధ్వానంగా మారిందని, కృష్ణకాంత్ పార్క్ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ను సందర్శించినప్పుడు కూడా దారుణ పరిస్థితులు కనిపించాయని తెలిపారు. మలక్పేట్లో గంజ్ ప్రాంతంలో రోడ్లు, స్ట్రీట్ లైట్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
హైదరాబాద్లో సరైన ఫ్లైఓవర్లు లేవని, GHMC అసలు ఏం చేస్తోందో అర్థం కావడం లేదని కవిత విమర్శించారు. కుమ్మరిగూడలో కుమ్మరి కార్మికులకు మట్టి దొరకని పరిస్థితి ఉందని, చార్మినార్ ప్రాంతంలో మల్టీ లెవల్ పార్కింగ్ పనులు నిలిచిపోయాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
సీతాఫల్మండిలో స్కూల్ను కూల్చి వదిలేయడం దారుణమని, అది ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదురుగానే ఉన్నా పట్టించుకోవడం లేదని అన్నారు. జియాగూడా, అంబర్పేట్, గోషామహల్, చంద్రయాన్గుట్ట వంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఆమె వివరించారు.
హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు కేంద్రానికి పన్నుల రూపంలో రూ.5 లక్షల కోట్లకు పైగా చెల్లించగా, తిరిగి రాష్ట్రానికి కేవలం రూ.3,76,715 కోట్లు మాత్రమే వచ్చాయని, దాదాపు రూ.59,200 కోట్లు తక్కువ ఇచ్చారని ఆరోపించారు.
Also Read: అధిష్టానం నిర్ణయమే ఫైనల్.. కేబినెట్ మార్పులపై మహేష్కుమార్ గౌడ్
చివరగా, తెలంగాణలో విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని కవిత సూచించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రకటించిన లక్ష ఇళ్ల పథకంలో 60 వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్లను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసి పేదలకు అందించాలని ఆమె డిమాండ్ చేశారు.