sabarimala: కేరళలోని శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. మొదటి రెండు రోజుల్లోనే దాదాపు 2 లక్షల మందికి పైగా తరలి వచ్చారు. భక్తులతో ఆలయ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. పంబ నుంచి సన్నిధానం వరకు విపరీతమైన రద్దీతో.. చాలామంది బారికేడ్లను సైతం ఎక్కారు. భక్తుల రద్దీ విషయంలో.. ఆలయ బోర్డు, ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రద్దీకి సరిపడా ఏర్పాట్లు చేయలేదని భక్తులు మండిపడుతున్నారు.
రద్దీకి సరిపడా ఏర్పాట్లు చేయలేదంటూ.. ఆలయ అధికారులపై మండిపడుతున్న భక్తులు..
ఇసుకేస్తే రాలనంత భక్తజనం ఉండటంతో.. రద్దీ నియంత్రణ భారంగా మారింది. పోలీస్ బందోబస్తు పెద్దగా లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కొండపైకి వెళ్లే మార్గంలో.. క్యూలైన్లలో గంటల తరబడి నిలబడ్డారు. అలా నిల్చున్నప్పుడు కనీసం నీళ్లు కూడా అందలేదని విమర్శలు వస్తున్నాయి.
క్యూలైన్లో కిందపడి మరణించిన భక్తురాలు..
క్యూలైన్లో భారీ రద్దీతో తొక్కిసలాంటి పరిస్థితి ఏర్పడింది. ఓ మహిళ క్యూలో కిందపడి మరణించింది. మృతురాలు కోజికోడ్ జిల్లా కోయిలాండికు చెందిన భక్తురాలిగా గుర్తించారు. దీంతో ఆలయ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. రద్దీకి తగిన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. యాసిడ్ ట్యాంకర్ను ఢీ కొన్న బస్.. స్పాట్లో 40 మంది
ఈనెల 24 వరకు రోజుకు 75 వేల మందికే దర్శనం..
అయ్యప్పస్వామి దర్శనానికి ఈ నెల 24వరకు.. రోజుకు 75వేల మంది భక్తుల్నే అనుమతించనున్నారు. ప్రస్తుతం శబరిమలకు భక్తులు భారీగా తరలి వస్తుండడంతో.. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు.. ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజుకు వర్చువల్ క్యూలైన్ ద్వారా 70వేల మందిని.. స్పాట్ బుకింగ్ ద్వారా 5వేల మందినే దర్శనానికి అనుమతించనున్నారు. ఇలా బుక్ చేసుకున్న తేదీల్లోనే భక్తులు దర్శనానికి రావాలన్నారు SP ఆనంద్.