Tripura Student Death: ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో చోటుచేసుకున్న ఘర్షణ విషాదాంతమైంది. విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో త్రిపురకు చెందిన ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ ఘటనను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇదొక ‘ద్వేషపూరిత నేరం’ (Hate Crime) అని అభివర్ణించిన ఆయన, దేశంలో పెరుగుతున్న అసహనంపై బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టారు.
అసలేం జరిగింది?:
పోలీసుల వివరాల ప్రకారం.. డెహ్రాడూన్లో కొంతమంది విద్యార్థుల మధ్య చిన్నపాటి వివాదం మొదలైంది. మాటమాట పెరిగి అది ఘర్షణకు దారితీసింది. ఈ దాడిలో త్రిపురకు చెందిన విద్యార్థి మైఖేల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన డెహ్రాడూన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 25,000 రివార్డు కూడా ప్రకటించారు.
డెహ్రాడూన్లో సుమారు 400 మందికి పైగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు నివసిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో వారిలో ఆందోళన నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల కోసం ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. వారి నివాస ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ద్వేషానికి ఆజ్యం పోస్తున్నారు: రాహుల్ గాంధీ
ఈ ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “డెహ్రాడూన్లో ఏంజెల్ చక్మా, ఆమె సోదరుడు మైఖేల్కు జరిగిన అన్యాయం అత్యంత భయంకరమైన ద్వేషపూరిత నేరం. ద్వేషం అనేది రాత్రికి రాత్రే పుట్టుకురాదు. గత కొన్నేళ్లుగా విషపూరితమైన కంటెంట్, బాధ్యతారహితమైన కథనాల ద్వారా మన యువతలో ఈ ద్వేషానికి ఆజ్యం పోస్తున్నారు.” అని మండిపడ్డారు.
పాలక బీజేపీ నేతలు ఇటువంటి విద్వేషపూరిత చర్యలను ఖండించకపోగా, వాటిని సాధారణీకరిస్తున్నారని (Normalizing) రాహుల్ ఆరోపించారు. “భారతదేశం గౌరవం, ఐక్యత అనే పునాదులపై నిర్మించబడింది.. భయం మీద కాదు. మనది ప్రేమ, వైవిధ్యం కలిగిన దేశం. తోటి భారతీయులపై దాడులు జరుగుతుంటే చూస్తూ మౌనంగా ఉండే ‘మృత సమాజం’గా మనం మారకూడదు. మన దేశం ఏ దిశగా వెళ్తుందో ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి.” అని పిలుపునిచ్చారు. చక్మా కుటుంబానికి, ఈశాన్య ప్రజలకు అండగా ఉంటామని, వారిని సోదరసోదరీమణులుగా పిలుచుకోవడానికి గర్విస్తున్నామని రాహుల్ పేర్కొన్నారు.
Read Also: Eagle Team: న్యూఇయర్.. ఎవరైనా అలా చేస్తే అంతే సంగతులు, 150 మందితో..?: ఈగల్ ఎస్పీ సీతారాం