Lok Sabha Speaker Election Live Updates: లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నికకు రంగం సిద్దమైంది. బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్డీయే తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అయితే ప్రతిపక్ష ఇండియా కూటమి తమ అభ్యర్థిగా కేరళలోని మావెళిక్కర ఎంపీ కే సురేష్ను బరిలోకి దింపింది. దీంతో స్పీకర్ పదవికి రేపు(బుధవారం) ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. కాగా ఈ ఎన్నిక 1976 తర్వాత తొలి స్పీకర్ ఎన్నిక కావడం విశేషం.
11 గంటల తర్వాత బీజేపీ ఎంపీలంతా లోక్ సభలో హాజరుకావాలని కాషాయ పార్టీ విప్ జారీ చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా విప్ జారీ చేసింది. బుధవారం చాలా ప్రధానమైన అంశం చర్చలోకి రానుందని.. కావున ఎంపీలందరూ ఉదయం 11 గంటల నుంచి సభ వాయిదా పడే వరకు లోక్ సభలోనే ఉండాలని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కే సురేష్ విప్ జారీ చేశారు.
అటు తెలుగుదేశం పార్టీకూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. బుధవారం ఉదయం 11 గంటల లోపు సభకు హాజరుకావాలని ఆ పార్టీ చీఫ్ హరీష్ బాలయోగీ త్రీ లైన్ విప్ జారీ చేశారు. ఎన్డీయే స్పీకర్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Also Read: కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం.. స్పీకర్గా అభ్యర్థిత్వంపై టీఎంసీ ఎంపీ..
లోక్ సభ స్పీకర్ గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా నియామకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు కేటాయించాలని ఇండియా కూటమి సభ్యులు పట్టుపట్టారు. కానీ ఈ విషయంలో బీజేపీ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టాలని నిశ్చయించుకుంది. దీంతో కే సురేష్ను రంగంలోకి దింపింది ఇండియా కూటమి.
ఈ విషయంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కేసీ వేణుగోపాల్, డీఎంకే నేత టీఆర్ బాలుతో ఆయన ఈ ఉదయం భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి ప్రతిపక్షాలు ససేమిరా అనడంతో ఎన్నిక తప్పడం లేదు.
Also Read: Pathankot high alert: పఠాన్కోట్లో ఇద్దరు ఉగ్రవాదులు ఎంట్రీ, పోలీసులు హై అలర్ట్
భారత రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా, కొత్తగా ఎన్నికైన లోక్ సభ తొలి సెషన్ కు ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించడం, సభ ప్రారంభ కార్యక్రమాలను పర్యవేక్షించడం కోసం భారత రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్ను నియమిస్తారు. ఎంపీల ప్రమాణ స్వీకారం తరువాత అధికార పక్ష, ప్రతిపక్షాల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.
సాధారణంగా అధికార పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థికి ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతాయి. అలాంటి సమయంలో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఇక వేళ ఇరుపక్షాలు అభ్యర్థులను బరిలో నిలిపితే ఎన్నిక అనివార్యం అవుతుంది. అలాంటప్పుడు సాధారణ మెజార్టీతో స్పీకర్ను ఎన్నుకుంటారు.