NCP : NCP జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ రాజీనామా నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. శరద్ పవారే పార్టీ అధ్యక్షుడిగా కంటీన్యూ కావాలని కేడర్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో స్పష్టమైన నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు పవార్. శుక్రవారంతో ఆ సస్పెన్స్కు తెరపడనుందా అనే చర్చ నడుస్తోంది.
పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం శరద్ పవార్.. ఇప్పటికే ఓ కమిటీని నియమించారు. సుప్రియా సూలే, అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ శుక్రవారం ముంబైలో భేటీ కానుంది. ఈ సమావేశం తర్వాత రాజీనామాపై శరద్ పవార్ తుది నిర్ణయం వెల్లడించే ఛాన్స్ ఉంది. రాజీనామాపై శరద్ పవార్ వెనక్కి తగ్గే ఉద్దేశంలో లేనట్టు కనబడుతోంది. పార్టీలో చీలిక రాకుండా ఉండేందుకే పవార్ ముందు జాగ్రత్త పడ్డారా అనే చర్చ నడుస్తోంది. అయితే ఎన్సీపీ జాతీయస్థాయి బాధ్యతలను సుప్రియా సూలే చేపడుతుందని, పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడిగా అజిత్ పవార్ నియమితులయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఎన్సీపీ నేతలు చాలామంది బీజేపీతో వెళ్లేందుకు నిర్ణయించుకోవడం వల్లే ఆ పార్టీ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాలని శరద్ పవార్ భావించారని శివసేన అధికార పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొనడంపై ఎన్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్తలను ఎన్సీపీ లీడర్లు ఖండిస్తున్నారు. ఎన్సీపీ ఐక్యంగా ఉందంటున్నారు. మరోవైపు శరద్ పవార్ రాజీనామా నేపథ్యంలో ఆయన కుమార్తె సుప్రియా సూలేకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఫోన్ చేసి మాట్లాడారు. తాజా పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు.