
Wrestlers Protest latest news(Telugu breaking news today): అమిత్షా రంగంలోకి దిగారు. రెజ్లర్లు ఉద్యోగాల్లో చేరారు. పోరాటం విరమించుకున్నారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. అలాంటిదేమీ లేదని.. విధుల్లో చేరిన మాట నిజమేనని.. అయితే న్యాయం జరిగే వరకు పోరాటం మాత్రం ఆపేది లేదని తేల్చిచెప్పారు ఆందోళన చేస్తున్న టాప్ రెజ్లర్లు.
ఒలింపిక్ మెడల్ విజేత సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా.. రైల్వేశాఖలో తిరిగి విధుల్లో చేరారు. అయితే వీరంతా మే 31నే డ్యూటీలో చేరారని రైల్వేశాఖ చెబుతోంది. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసినట్టు తెలుస్తోంది.
వారంతా విధుల్లో చేరారని తెలీగానే.. ఆందోళన విరమించారంటూ మీడియాలో బ్రేకింగ్ న్యూస్లు నడిచాయి. కావాలనే అలా ప్రచారం చేస్తున్నారంటూ బాధిత రెజ్లర్లు మండిపడుతున్నారు. ఆ మేరకు రెజ్లర్ సాక్షి మాలిక్ ట్విటర్లో క్లారిటీ ఇచ్చారు. న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో తాము వెనక్కి తగ్గలేదని.. ఉద్యమం, ఉద్యోగం రెండూ చేస్తున్నానని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు.
శనివారం అర్థరాత్రి బాధిత రెజ్లర్లతో.. కేంద్ర హోంమంత్రి అమిత్షా తన ఇంట్లో జరిపిన రహస్య భేటీ వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. సాక్షి మాలిక్, సంగీతా ఫొగాట్, బజ్రంగ్ పునియాలు.. షా తో సుమారు 2 గంటల పాటు సమావేశమయ్యారని చెబుతున్నారు. బ్రిజ్ భూషణ్పై నిష్పాక్షితంగా దర్యాప్తు జరిపించాలని.. త్వరగా ఛార్జ్షీట్ దాఖలయ్యేలా చూడాలని ఆ రెజ్లర్లు.. అమిత్షాను కోరినట్టు తెలుస్తోంది. చట్టం అందరికీ సమానమేనని.. చట్టాన్ని తన పని తాను చేయనివ్వండని.. అమిత్ షా రెజ్లర్లకు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. శనివారం రాత్రి వారి భేటీ జరగ్గా.. తాజాగా రెజ్లర్లు తిరిగి రైల్వేలోని తమ విధుల్లో చేరడం ఆసక్తికరం. అయితే, ఉద్యోగంతో పాటే ఉద్యమమూ చేస్తామని.. న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తేల్చి చెబుతున్నారు.