Wrestlers protest news(Breaking News in India): భారత రెజ్లర్ల న్యాయ పోరాటానికి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు క్రీడాకారులు వారికి సంఘీభావం ప్రకటించగా.. తాజాగా కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీ కూడా రెజ్లర్స్కు అండగా నిలిచారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు నిరసనగా.. గత 8రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ గ్రౌండ్లో నిరసన తెలుపుతున్న రెజ్లర్స్ను ప్రియాంకా గాంధీ కలిసారు. స్వయంగా రెజ్లర్ల నిరసన దీక్షకు వెళ్లి వారితో మాట్లాడారు. రెజ్లింగ్ చీఫ్ నుంచి తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ప్రియాంక అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంట సేపు వారితోనే ఉన్నారు.
మల్లయోధులు చేస్తున్న న్యాయపోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రియాంక. మహిళల ఆత్మగౌరవం గురించి గొప్పగా మాట్లాడే మోదీ.. సెక్సువల్ హరాస్మెంట్కు వ్యతిరేకంగా రెజ్లర్స్ పోరాటం చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదని,, బీజేపీ ఎంపీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ప్రియాంక గాంధీ విమర్శించారు.
ఎంపీపై నమోదైన FIR కాపీ ఇంకా వారికి అందలేదని, అసలు అందులో ఏముందో కూడా తెలియదన్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటున్నారు కదా.. పదవీ నుంచి అతన్ని ఎందుకు తొలగించడం లేదన్నారు. తమకు జరిగిన అన్యాయంపై మూడు నెలలుగా న్యాయ పోరాటం చేస్తున్న రెజ్లర్స్తో మోదీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రియాంక నిలదీశారు. మెడల్ గెలిస్తే గెలిస్తే పొగిడే ప్రధాని.. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.
మరోవైపు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై 2 కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. బ్రిజ్ భూషణ్పై లైంగిక ఆరోపణలు చేస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని రెజ్లర్స్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. రెండు కేసులు నమోదు అయ్యాయి. ఫిర్యాదు చేసిన రెజ్లర్స్లో ఒక మైనర్ కూడా ఉండడంతో.. బ్రిజ్ భూషణ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
తమకు న్యాయం చేయాలని.. ఏప్రిల్ 21న ఏడుగురు మహిళా రెజ్లర్స్.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు. విచారణ సందర్భంగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై కేసు నమోదు చేస్తామని సుప్రీంకోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలిపారు. బ్రిజ్ భూషణ్ను ఆరెస్టు చేసేదాకా తాము నిరసనలను ఆపబోమని రెజ్లర్స్ స్పష్టం చేస్తున్నారు.
ఈ ఘటనపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కూడా తన వివరణ ఇచ్చారు. ఈ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని… దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని చెప్పారు. రాజీనామా చేస్తే వారి ఆరోపణలను అంగీకరించినట్లు అవుతుందని అన్నారు. తమ నియోజకవర్గ ప్రజల వల్ల ఎంపీని అయ్యానని అన్నారు. ఒక కుటుంబం మాత్రమే నిరసన వ్యక్తం చేస్తోందని… 90 శాతం మంది ఆటగాళ్ల మద్దతు తమకే ఉందని చెప్పారు.
మరోవైపు, రెజ్లర్లలో ఆగ్రహం పెరిగిపోతోంది. వారు చేస్తున్న నిరసనకు క్రికెటర్ల నుంచి ఎటువంటి సంఘీభావం రాకపోవడంపై రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ నిరసనకు మద్దతు తెలపకుండా వారు దేనికి భయపడుతున్నారని రెజ్లర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ వేదికలపై విజయాలు సాధించిన అథ్లెట్ల గురించి పోస్టులు పెట్టే క్రికెటర్లు.. తాము చేస్తోన్న నిరసనలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. యావత్దేశం క్రికెట్ను ఆరాధిస్తున్నా ఒక్క క్రికెటర్ కూడా మా ఆందోళనపై స్పందించలేదని రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రికెటర్లు మాకు అనుకూలంగా మాట్లాడాలని మేం అడగట్లేదు… న్యాయం కోసం స్పందించకుండా మీ మౌనం బాధిస్తోందని వారు వాపోతున్నారు. అమెరికాలో జరిగిన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్మెంట్కు మన క్రికెటర్లు కొందరు మద్దతు పలికారు. ఆ మాత్రం మద్దతుకు మేం అర్హులం కాదా అని రెజ్లర్లు ప్రశ్నించారు. మీరు సోషల్ మీడియా వేదికగా ఫొటోలు, మీ బ్రాండ్ల గురించి పోస్టులు పెడతారు కానీ.. మాకు న్యాయం జరగాలని ఒక్క పోస్టు పెట్టలేరా అంటూ ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.
జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను జైలుకు పంపే వరకు తమ నిరసన కొనసాగుతుందని రెజ్లర్లు తేల్చి చెబుతున్నారు.