Crime Thriller OTT : ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సైబర్ క్రైమ్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఎంతలా చర్యలు తీసుకున్నా, నేరస్తులు కొత్త దార్లు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక మలయాళం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లను చాలా సహజంగా చూపిస్తుంది. ఇందులో పోలీసులు నిజంగా ఎలా పనిచేస్తారో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇది కేవలం క్రైమ్ థ్రిల్లర్గానే కాకుండా, ప్రస్తుత సమాజంలోని నిరుద్యోగ సమస్యను కూడా ఆలోచనాత్మకంగా చూపిస్తుంది. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఆపరేషన్ జావా’ (Operation Java). వి సినిమాస్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ సినిమా తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో బాలు వర్గీస్, లుక్మాన్ అవరన్, బిను పప్పు, ఇర్షాద్, షైన్ టామ్ చాకో, మమితా బైజు, వినాయకన్ వంటి నటులు నటించారు. కొచ్చిలోని సైబర్ సెల్ పోలీస్ స్టేషన్ చేపట్టిన విచారణతో కథనం ఉంటుంది. ఈ చిత్రం 2021 ఫిబ్రవరి 12 న విడుదలై,విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా IMDbలో 8.1/10 రేటింగ్ కూడా పొందింది. Zee5, Jio hotstarలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
ఆంటోనీ, వినయ్ దాసన్ అనే ఇద్దరు బి.టెక్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారు. సైబర్ క్రైమ్ పై వాళ్ళకి ఉన్న అవగాహనను గమనించిన కొచ్చి పోలీసులు, వాళ్ళని కేవలం టెంపర్వరి ఉద్యోగం కింద సైబర్ సెల్లోకి తీసుకుంటారు. పైరసీ, జాబ్ ఫ్రాడ్స్, బ్యాంక్ అకౌంట్ హ్యాకింగ్ వంటి విభిన్న కేసులను, వీళ్ళు తమ తెలివితేటలతో ఎలా ఛేదించారో ఈ కథ చూపిస్తుంది. సినిమా అంతా చాలా వేగంగా, ఉత్కంఠభరితంగా సాగుతూ సైబర్ నేరాల వెనుక ఉన్న అసలు సీక్రెట్స్ ని బయటపెడుతుంది.
అయితే కేవలం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాకుండా, ఈ సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోని ఇబ్బందులను కూడా చూపిస్తుంది. ఎంతో కష్టపడి పోలీసులకు పెద్ద పెద్ద కేసుల్లో సహాయం చేసినప్పటికీ, తాత్కాలిక ఉద్యోగులు కావడంతో వాళ్ళలో నిరుద్యోగ భయం పెరుగుతుంది. ఇక సినిమా చివరలో ఒక కీలకమైన హత్య కేసును ఛేదించినా, వాళ్ళకి దక్కాల్సిన సరైన గుర్తింపు దక్కకపోవడం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.