Crime Thriller Series on OTT : ఇన్వెస్టిగేషన్ కంటెంట్ అంటేనే ఆడియన్స్ చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే సీరియల్ కిల్లర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఓ రేంజ్ లో థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. వీటిని అస్సలు వదిలిపెట్టరు ప్రేక్షకులు. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓటీటీలో టాప్ వెబ్ సిరీస్ లలో ఒకటిగా నిలిచింది. ఇందులో కిల్లర్ తను చంపిన ప్రతి శవం పక్కన ఒక చిన్న బొమ్మను వదిలి వెళ్లడం, ఆ బొమ్మ మీద ఎప్పుడో చనిపోయిందనుకున్న అమ్మాయి వేలిముద్రలు దొరకడం వంటి అంశాలతో కథ చాలా గ్రిప్పింగ్గా సాగుతుంది. చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే టెన్షన్ పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ ది చెస్ట్నట్ మ్యాన్’ (The Chestnut Man). ఇది డెన్మార్క్కు చెందిన సిరీస్. ప్రపంచప్రసిద్ధి చెందిన ‘The Killing’ సిరీస్ రాసిన సోరెన్ స్వీస్ట్రప్ రాసిన నవల ఆధారంగా దీన్ని తీశారు. అందుకే ఇందులో క్రైమ్ ఎలిమెంట్స్ చాలా గట్టిగా ఉంటాయి. ఈ సిరీస్ ‘నార్డిక్ నోయిర్’ అనే స్టైల్లో ఉంటుంది. అంటే కథలో వాతావరణం అంతా మబ్బులు పట్టినట్లు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా భయంకరంగా, ఉత్కంఠగా అనిపిస్తుంది. ప్రధాన పాత్రల్లో నటించిన దానికా కుర్చిక్, మిక్కెల్ బో ఫోల్స్గార్డ్ తమ నటనతో ప్రాణం పోశారు. వీరిద్దరూ డిటెక్టివ్లుగా ఒకరికొకరు సంబంధం లేని మనస్తత్వాలు కలిగిన పాత్రల్లో అద్భుతంగా నటించారు. మొదటి సీజన్లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ సుమారు 50 నిమిషాల వరకు ఉంటుంది. తక్కువ ఎపిసోడ్లు ఉండటం వల్ల కథ ఎక్కడా సాగదీసినట్లు అనిపించదు. 2021లో నెట్ఫ్లిక్స్ (Netflix) లో రిలీజ్ అయినప్పుడు టాప్ రేటెడ్ సిరీస్లలో ఒకటిగా నిలిచింది ఇది. ఐఎండీబీలో కూడా దీనికి 7.7/10 రేటింగ్ ఉంది. ఇక ఈ సిరీస్ రెండవ సీజన్ 2026 మే 7న విడుదల కానుంది.
డెన్మార్క్లోని కోపెన్హాగన్ నగరంలో ఒక మహిళ దారుణంగా హత్యకు గురవుతుంది. ఆ శవం పక్కన కొన్ని ఎండు కాయలతో (Chestnuts) చేసిన ఒక చిన్న బొమ్మ కనిపిస్తుంది. అయితే ఆ బొమ్మ మీద ఒక సంవత్సరం క్రితం కిడ్నాప్ అయి, చనిపోయిందని భావించిన ఒక మంత్రి కూతురి వేలిముద్రలు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అప్పటికే ఆ కేసు ముగిసిపోయిందని పోలీసులు అనుకుంటున్న తరుణంలో ఈ కొత్త క్లూ సంచలనం సృష్టిస్తుంది. ఇక ఈ మిస్టరీని ఛేదించడానికి తూలిన్, హెస్ అనే ఇద్దరు డిటెక్టివ్లు రంగంలోకి దిగుతారు.
వీళ్ళు దర్యాప్తు చేస్తున్న కొద్దీ, కిల్లర్ మరిన్ని హత్యలు చేస్తూ ప్రతి చోటా ఆ బొమ్మను వదిలి వెళ్తుంటాడు. ఆ హత్యలన్నిటికీ, గతం లో జరిగిన కొన్ని సంఘటనలకి ఏదో సంబంధం ఉందని వీళ్ళకి అర్థమవుతుంది. అసలు చనిపోయిన అమ్మాయి వేలిముద్రలు ఇప్పుడు ఎలా వస్తున్నాయి? కిల్లర్ లక్ష్యం ఎవరు? అనే ఉత్కంఠతో కథ సాగుతుంది. చివరికి ఆ కిల్లర్ ఎవరో కాదు, పోలీసుల దర్యాప్తులో సహాయం చేస్తున్న ఒక వ్యక్తే అని తెలుస్తుంది. ఈ లోగా కిల్లర్ డిటెక్టివ్ ల మీద కూడా మర్డర్ ప్లాన్ వేస్తాడు. ఆ కిల్లర్ ప్లాన్ నుండి డిటెక్టివ్లు ఎలా బయటపడ్డారు ? ఆ మంత్రి కూతురు నిజంగా బతికే ఉందా ? కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? అనే ఉత్కంఠభరితమైన ముగింపుతో ఈ సిరీస్ పూర్తవుతుంది.
Read Also : ‘స్క్విడ్ గేమ్’ ను మించిన అరాచకం… ప్రపంచాన్ని వణికించిన జపాన్ మూవీ