తమ సమస్యలు, డిమాండ్లు పరిష్కారాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు రెండ్రోజులుగా సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. సర్కారు నుంచి సరైన స్పష్టత రాకపోవడంతో వారంతా రోడ్డెక్కారు. పదవీ విరమణ పొందిన వారికి బెనిఫిట్స్ కూడా రావడం లేదని, ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని కార్మికులు ఆరోపించారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పే స్కేల్ ఇవ్వడం లేదని, యూనియన్లు పునరుద్ధరించి ఎన్నికలు జరుపుకునేందుకు అనుమతులు ఇవ్వాలని.. అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికుల పక్షాల ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. అయితే, సమ్మె విరమించాలని చర్చ ద్వారా పరిష్కారం దొరుకుతుందని ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించడంలో ఆలస్యం చేయడంతో కార్మికుల ఆవేశం కట్టలు తెచ్చుకున్నది. ఎందుకంటే వరంగల్ జిల్లాలో ఓ డ్రైవర్, భద్రాద్రి జిల్లాలో మరో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన డ్రైవర్ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. దీంతో ఆయన మృతదేహాన్ని తమకు అప్పగించాలని, డిపో ఎదుట ఉంచి నిరసన తెలుపుతామని అక్కడి కార్మికులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మరో కార్మికుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పెద్దగా స్పందించలేదని టాక్ వినిపించింది.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నేరవేర్చకపోవడం వల్లే వారంతా సమ్మెకు దిగారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కార్మికుల ఆత్మహత్యలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు పాలిటిక్స్ చేస్తున్నారని హస్తం పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత, పీఆర్సీ, ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణపై సీఎం రేవంత్ కీలక హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ఆధారంగా కార్మికుల సమస్యలు తీర్చాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలని, సర్కారీ కొలువుతో పాటు రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సమ్మె విరమణ.. ఉదయం నుంచే రోడ్డెక్కనున్న బస్సులు!
కేటీఆర్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు కార్మికులు, కాంగ్రెస్ నేతలు గులాబీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. పదేండ్ల పాలనా సమయంలో ఈ ప్రతిపాదనను పక్కనబెట్టి సరిగ్గా ఎన్నికల సమయంలో విలీనంపై మాట్లాడారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆర్టీసీ కార్మికులు సుమారు 45 రోజులుగా పైగా ధర్నా చేశారు. నాడు వారికి కేసీఆర్ పట్టించుకోలేదు. అందులో కొందరు ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజగా కాంగ్రెస్ పాలనలో ఓ కార్మికుడి మృతిని సర్కార్ సీరియస్గా తీసుకున్నది.వెంటనే ఆర్టీసీ జేఏసీతో చర్చలకు సిద్ధమని ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. కానీ, గతంలో కేసీఆర్ కార్మికులను చాలా ఇబ్బంది పెట్టారని, వారిపై ఎస్మా సైతం ప్రయోగించారని..కొందరు గుర్తుచేస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఆర్టీసీని మొత్తం సర్వనాశనం చేశారని పలువురు కార్మికులు ఆరోపించారు.గత పదేండ్లలో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తే ఇప్పుడు వారు రోడ్డెక్కెవారా? అని హస్తం పార్టీ నేతలు ప్రతిపక్షాన్ని నిలదీశారు.