Documentary Series on OTT : రియల్ స్టోరీస్ ఎన్నెన్నో ఓటీటీలలో అందుబాటులో ఉన్నాయి. కానీ తాజాగా దేశాన్ని అల్లకల్లోలం చేసిన ‘హత్రాస్’ ఘటనపై రూపొందిన డాక్యుమెంటరీ సిరీస్ ఒకటి ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. దాన్ని చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్ళు ఆగవు. రక్తం ఉడికిపోతుంది. మరి ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అసలు కథ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…
Hathras 16 Days (2026) అనే టైటిల్ తో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ ఇది. భారతదేశాన్ని తీవ్రంగా కుదిపేసిన 2020 నాటి హత్రాస్ దారుణ సంఘటన ఆధారంగా రూపొందింది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ లో ఒక యువ దళిత మహిళపై జరిగిన దాడి నుండి మొదలు పెడితే, ఆమె మరణం తర్వాత అర్ధరాత్రి జరిగిన బలవంతపు అంత్యక్రియల వరకు ఓ ఒక్క నిజాన్ని దాచకుండా చూపించారు ఇందులో. 16 రోజులలో ఏం జరిగిందనేది ఈ సిరీస్ లో క్లియర్ గా చూడవచ్చు. పాట్రిక్ గ్రాహం దర్శకత్వంలో రూపొందిన ఈ డాక్యు-సిరీస్ మే 15 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ZEE5 లో ప్రసారం అవుతోంది. ఈ డాక్యుమెంటరీ విడుదలైన తర్వాత ఈ కేసును రీ ఓపెన్ చేయాలనే డిమాండ్ వినబడుతోంది. ముఖ్యంగా ఇందులో చూపించిన సంచలన నిజాల ఆధారంగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఈ కేసుపై మళ్లీ కొత్తగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తుండడం గమనార్హం.
ఆ 16 రోజుల నరకం చుట్టూనే కథ అంతా నడుస్తుంది. 2020 సెప్టెంబర్ 14న ఉత్తరప్రదేశ్లోని హత్రాస్కు చెందిన 19 ఏళ్ల దళిత యువతి స్టోరీ ఇది. ఆమెపై అగ్రవర్ణానికి చెందిన కొందరు వ్యక్తులు అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడతారు. దీంతో తీవ్రమైన వెన్నెముక గాయాలతో ఆమె ఢిల్లీ ఆసుపత్రిలో రెండు వారాల పాటు ప్రాణాలతో పోరాడుతుంది. కానీ సెప్టెంబర్ 29న మృత్యువాత పడుతుంది. అయితే ఆమెపై దాడి జరిగిన రోజు నుండి.. మరణించిన తర్వాతి రోజు వరకు గడిచిన ఆ 16 రోజులలో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగకుండా వ్యవస్థ, రాజకీయం ఎలా అడ్డుపడ్డాయనేదే ఈ 3 ఎపిసోడ్ల సిరీస్ ప్రధాన కథాంశం. ఈ కేసులోనే కాకుండా భారత చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన, కలచివేసే ఘట్టం ఏదైనా ఉందా అంటే అది ఆమె దహన సంస్కారాలే. బాధితురాలి శవాన్ని అర్ధరాత్రి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా పోలీసులు బలవంతంగా దహనం చేయడం అత్యంత దారుణం.
సెప్టెంబర్ 30 తెల్లవారుజామున 2:30 గంటలకు హిందూ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. కనీసం కూతురి ముఖాన్ని తల్లిదండ్రులకు చూపించకుండా పోలీసులు చేసిన అరచకాన్ని ఈ డాక్యుమెంటరీలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సిరీస్కు జర్నలిస్ట్ తనుశ్రీ పాండే చేసిన ఇన్వెస్టిగేషన్ వెన్నెముకగా నిలిచిందని చెప్పాలి. ఆమె నిర్భయంగా నిజాలన్నింటినీ బయట పెట్టారు. అలాగే కుముద్ మిశ్రా, అంజలి శివరామన్, పవైల్ గులాటి ఇందులో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.
Read Also : బ్రూస్ లీ కథ ఆధారంగా వచ్చిన మార్షల్ ఆర్ట్స్ సిరీస్… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?