OTT Movie: మీరు ‘ఐస్ రోడ్’ (2021) మూవీ చూశారా? అయితే, తప్పకుండా చూడండి. దానికి సీక్వెల్గా వచ్చిన ‘ఐస్ రోడ్: వెంజెన్స్’ (Ice Road: Vengeance 2025) ఇప్పుడు అది ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ మూవీ మొత్తం నేపాల్ చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా ఎవరెస్టుకు వెళ్లే మార్గంలో ఈ మూవీని చిత్రీకరించారు. ఈ మూవీలోని కొన్ని సీన్లు ఒళ్లుగగూర్పాటు కలిగించేలా ఉంటాయి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మూవీలో లియం నీసన్ కీలక పాత్రలో నటించాడు. జోనథాన్ హెన్లీ దర్శకత్వం వహించాడు.
మైక్ మెకాన్ (లియం నీసన్) కొండలు ఎక్కడంలో అనుభవజ్ఞుడు. ఐస్ రోడ్ ట్రక్ డ్రైవర్ కూడా. అయితే, తన సోదరుడు గర్టీ మరణం తర్వాత బాధలో మునిగిపోతాడు. గర్టీ మరణానికి ముందు తన తమ్ముడితో గడిపిన క్షణాలు అతడికి గుర్తుకొస్తూ ఉంటాయి. అతడిని తలచుకుని చాలా బాధపడతాడు. తన తమ్ముడు.. అన్న మైక్తో కలిసి నేపాల్ వెళ్లి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని అనుకుంటాడు. కానీ, ఆ కోరిక నెరవేరకుండానే చనిపోతాడు. గర్టీ ఆఖరి కోరిక తీర్చడం కోసం మైక్.. అతడి అస్తికలను ఎవరెస్టు మీద చల్లాలని నిర్ణయించుకుంటాడు. ఈ సందర్భంగా నేపాల్కు బయల్దేరుతాడు.
కాఠ్మాండూలో మైక్ తన ట్రెక్కింగ్ గైడ్ ధని (ఫ్యాన్ బింగ్బింగ్)ను కలుస్తాడు. వారు ఎవరెస్ట్కు వెళ్లడం కోసం కివి ఎక్స్ప్రెస్ అనే టూర్ బస్ (కివి ఎక్స్ప్రెస్) ఎక్కుతారు. బస్లో టూరిస్టులు, ఒక అమెరికన్ ప్రొఫెసర్ (బెర్నార్డ్ కర్రీ) తదితరులు ఉంటారు. ఈ బస్ 12,000 అడుగుల ఎత్తులో ఉన్న ప్రమాదకరమైన మౌంటైన్ రోడ్లపై ప్రయాణిస్తుంది. మరోవైపు.. నేపాల్లోని ఓ గ్రామంలో జరిగే ఆందోళన కార్యక్రమాలను చూపిస్తారు.
ఆ కథలోకి వెళ్తే.. రుద్రా యాష్ (రాష్ జాడు) అనే కరప్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఒక డ్యామ్ కట్టాలని ప్లాన్ చేస్తాడు. దానికి స్థానిక రైస్ ఫ్యామిలీ, ఇతర గ్రామస్తుల భూమి అవసరం అవుతుంది. కానీ రైస్ ఫ్యామిలీ.. ముఖ్యంగా రాజ్ రైస్.. డ్యామ్ కట్టడాన్ని వ్యతిరేకిస్తాడు. దీంతో అతడి తండ్రి రుద్రా రాజ్ను హత్య చేయిస్తాడు. అతడు ప్రయాణిస్తున్న బస్సును యాక్సిడెంట్ చేసి లోయలోకి పడేలా చేస్తాడు. ఆ తర్వాత రైస్ ఫ్యామిలీలోని మిగిలిన సభ్యులను టార్గెట్ చేస్తారు. రాజ్ రైస్ కొడుకు విజయ్ రాయ్ను చంపాలని ప్లాన్ చేస్తారు. దీంతో విజయ్ వారి నుంచి తప్పించుకుని.. మైక్ ప్రయాణిస్తున్న కివి ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కుతాడు. అతడిని వెంబడిస్తున్న దుండగులు కూడా ఆ బస్సు ఎక్కుతారు. విజయ్ను కొట్టి స్పృహ తప్పేలా చేస్తారు. దీంతో ఆ బస్సులో ఉన్నవారు షాకవుతారు. మైక్, ధని.. ఆ దుండగుల నుంచి విజయ్ను రక్షించాలని అనుకుంటారు. ఆ దుండగులు సాక్షులను విడిచిపెట్టరని, ప్రాణాలతో ఉండాలంటే వారిని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటారు. ఎట్టకేలకు వారితో పోరాడి.. ఆ దుండగులను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. అంతలో అక్కడికి పోలీస్ పెట్రోలింగ్ వాహనం వస్తుంది. వారికి జరిగింది అంతా వివరించి ఆ దుండగులను అప్పగిస్తారు.
అయితే పోలీసులు విజయ్ను బంధించి.. అతడి తండ్రి ఎక్కడ దాక్కున్నాడో చెప్పాలని వేధిస్తారు. అప్పటికే అతడి తండ్రి రాజ్ ఓ సీక్రెట్ ప్లేస్కు వెళ్లి తలదాచుకుంటాడు. పోలీసులపై అనుమానం వచ్చి మైక్, ధని, ప్రొఫెసర్లు లోపలికి వెళ్లి చూస్తారు. అక్కడ విజయ్ను కట్టేసి ఉండటం చూసి షాకవుతారు. అక్కడ పోలీసులు, రుద్ర యాష్, అతడి అనుచరులతో తలపడతారు. కాల్పుల్లో ప్రొఫెసర్ చనిపోతాడు. అతడి కూతురు బస్సు నుంచి బయటకు రాకపోవడంతో సురక్షితంగా ఉంటుంది. తండ్రి చనిపోయాడని తెలిసి కుమిలిపోతుంది. ఆ ఆ తర్వాత అదే బస్సులో చైనా బోర్డర్ వైపు ప్రయాణం చేస్తారు. అటువైపు వెళ్తే చైనా సైనికులు తమకు రక్షణ కల్పిస్తారని విజయ్ చెబుతాడు. దీంతో అటుగా వెళ్తారు. అప్పటి నుంచి యాక్షన్ సన్నివేశాలు మరింత రంజుగా ఉంటాయి. ఐస్ రోడ్డుపై వారు చేసే పోరాటం.. ఘాట్ రోడ్లపై విన్యాసాలు ఆకట్టుకుంటాయి. మరి చివరికి ఏమైందనేది బుల్లితెరపై చూస్తే బాగుంటుంది. ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.