Telugu Family Drama : ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్లు లవ్ స్టోరీలు, క్రైమ్ థ్రిల్లర్లు, హారర్, సైకలాజికల్ సినిమాలతో నిండిపోయాయి. అయితే ఆ హడావుడి మధ్య మనసును తాకే, కుటుంబ భావోద్వేగాలను హృదయపూర్వకంగా చెప్పే సరికొత్త తెలుగు చిత్రం ‘ఇల్లు’ కూడా వచ్చింది. ఈ మూవీ ఈ వీకెండ్లో రిలీజై ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఇది కేవలం ఒక సినిమా కాదు… ఇల్లు అంటే ఏమిటో, ఇంటి అర్థం ఏమిటో లోతుగా ఆలోచింపజేసే హార్ట్వార్మింగ్ ఫ్యామిలీ డ్రామా.
ఒక ఇల్లు కేవలం నాలుగు గోడలు, పైకప్పు మాత్రమేనా? లేదా అందులో నిండి ఉండే జ్ఞాపకాలు, అనుబంధాలు, సంతోషాలు, బాధలు మన జీవితంలో భాగమా? అనే ప్రశ్నలను ఈ చిత్రం సెంటిమెంటల్గా, కొంత సెటైరికల్ టచ్ తో అలరిస్తోంది. ప్రధాన పాత్రలో కృష్ణ ప్రసాద్ (హర్షవర్ధన్) నటించారు. ఆయన మధ్య వయస్కుడైన రచయిత. పదేళ్లుగా అద్దెకు ఉంటున్న ఇంటిని తన సొంతింటిలా మార్చేస్తాడు. పుస్తకాలు, జ్ఞాపకాలు, వివిధ రకాల మొక్కలు పెంచడం… ఇవే అతని ప్రపంచం. అతని భార్య (బిందు చంద్రమౌళి)తో కలిసి ఆ ఇంటిలో గడిపిన ప్రతి క్షణం అతనికి అమూల్యం.
కానీ ఒక్కసారిగా అమెరికా నుంచి తిరిగి వస్తున్న ఓనర్ కొడుకు ఆ ఇంటిని స్టార్టప్ ఆఫీస్గా మార్చాలని నిర్ణయించుకోవడంతో సమస్య మొదలవుతుంది. యజమానులు ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తారు. తన ప్రాణంగా చూసుకున్న ఇంటిని వదలాల్సిన పరిస్థితి కృష్ణ ప్రసాద్ను ఎంతో కలవర పెడుతుంది. కొత్త ఇల్లు వెతికే ప్రయాణంలో అతనికి భువన్ (పవన్ రమేష్) అనే హౌస్ బ్రోకర్ పరిచయమవుతాడు. ఇద్దరూ కలిసి నగరం నలుమూలలా తిరిగి సరైన ఇల్లు వెతుకుతారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, కామెడీ, భావోద్వేగాలు ఉంటాయి. చివర్లో వచ్చే ట్విస్ట్లు, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల కళ్లు చెమ్మగా చేస్తాయి. అవేంటి అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
సీనియర్ నటుడు హర్షవర్ధన్ తన సహజ నటనతో కృష్ణ ప్రసాద్ పాత్రలో జీవించాడు. భార్యగా బిందు చంద్రమౌళి నటించారు. పవన్ రమేష్ హౌస్ బ్రోకర్ పాత్రలో చేసే కామెడీ బాగుంటుంది. అనీష్ కురువిల్లా, సునందిని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రోహిత్ పెనుమత్స (రోహిత్ అండ్ శశి) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ. ప్రతి సన్నివేశంలోనూ భావోద్వేగాలను మరింత లోతుగా చేర్చడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. శశాంక్ రాఘవుల సినిమాటోగ్రఫీ ఇంటి అందాన్ని, మధ్యతరగతి జీవితాన్ని అద్భుతంగా క్యాప్చర్ చేసింది. అవంతి రుయా ఎడిటింగ్ సినిమాను స్మూత్గా తీసుకెళ్లింది. కిషోర్ మారిశెట్టి (మనోహరి ఆర్ట్స్) నిర్మాతగా ఈ చిత్రాన్ని అందించారు. ETV Win తో కలిసి ‘కథా సుధ’ సిరీస్లో భాగంగా ఈ సినిమా జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ రోజుల్లో అతి హైప్, ట్విస్ట్లు నిండిన సినిమాల మధ్య ‘ఇల్లు’ వంటి సింపుల్, స్వీట్, సందేశాత్మక చిత్రాలు అరుదు. మధ్యతరగతి కుటుంబాలు, వారి ఇబ్బందులు, ఇంటి పట్ల ఉన్న అనుబంధం, ముసలి తరం – యువ తరం మధ్య గ్యాప్ వంటి అంశాలు ఈ చిత్రంలో సహజంగా చూపించారు. వీకెండ్ ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా ఈ మూవీని ఎంజాయ్ చేయవచ్చు.
Read Also : 44కు పైగా ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్న మూవీ… రన్ టైమ్ 20 నిమిషాలే