Psychological Thriller : సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేర్లలో ‘The Silence of the Lambs’ తప్పకుండా ఉంటుంది. సీరియల్ కిల్లర్ కథలు, సస్పెన్స్, మైండ్ గేమ్స్, ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్… ఇలా అన్ని అంశాలను అద్భుతంగా కలిపిన ఈ చిత్రం హాలీవుడ్ చరిత్రలోనే గొప్ప థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచింది. 1991లో విడుదలైన ఈ అమెరికన్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్కు జోనాథన్ డెమ్మే దర్శకత్వం వహించారు. జోడీ ఫోస్టర్, ఆంథనీ హాప్కిన్స్, టెడ్ లెవైన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఐదు ప్రధాన అకాడమీ అవార్డులు (Best Picture, Best Director, Best Actor, Best Actress, Best Adapted Screenplay) గెలుచుకున్న అరుదైన చిత్రాల్లో ఇది ఒకటి.
The Silence of the Lambs ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే Apple TV కూడా చూడొచ్చు.
అమెరికాలో ‘బఫెలో బిల్’ అని పిలవబడే ఒక క్రూరమైన సీరియల్ కిల్లర్ లావుగా ఉండే యువతులను కిడ్నాప్ చేసి, చంపి, వారి శరీరం నుండి చర్మాన్ని వలుస్తూ ఉంటాడు. అతన్ని పట్టుకోవడానికి ఎఫ్బీఐ (FBI) తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. ఈ కేసు పరిశోధన కోసం ఎఫ్బీఐ ట్రైనీ అయిన క్లారిస్ స్టార్లింగ్ (జోడీ ఫోస్టర్) ను రంగంలోకి దించుతారు. ఆ హంతకుడి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి, జైల్లో ఉన్న మరొక అత్యంత ప్రమాదకరమైన సైకియాట్రిస్ట్ కమ్ నరమాంస భక్షకుడు అయిన డాక్టర్ హన్నిబాల్ లెక్టర్ (ఆంథోనీ హాప్కిన్స్) సహాయం తీసుకోమని క్లారిస్కు చెబుతారు.
హన్నిబాల్ లెక్టర్ చాలా తెలివైనవాడు, నర నరాల్లో క్రూరత్వం నిండినవాడు. అతను క్లారిస్కు నేరుగా సహాయం చేయకుండా, ఆమె జీవితంలోని చేదు జ్ఞాపకాలను (ముఖ్యంగా చిన్నప్పుడు గొర్రె పిల్లలు అరుస్తున్నప్పుడు ఆమె కాపాడలేకపోయిన భయం) తనకు చెప్తేనే, బఫెలో బిల్ గురించిన క్లూస్ ఇస్తానని కండిషన్ పెడతాడు. వీరిద్దరి మధ్య జరిగే సైకలాజికల్ మైండ్ గేమ్స్ ఈ సినిమాకే హైలైట్. హన్నిబాల్ ఇచ్చిన ఆధారాలతో క్లారిస్ ఆ హంతకుడిని ఎలా పట్టుకుంది? ఈ లోగా హన్నిబాల్ జైలు నుండి ఎలా తప్పించుకున్నాడు ? అనేదే మిగతా కథ
The Silence of the Lambs బలం దాని స్క్రీన్ప్లే, పాత్రలు. ముఖ్యంగా హన్నిబల్ లెక్టర్ పాత్ర సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప విలన్ పాత్రల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆంథనీ హాప్కిన్స్ కేవలం కొద్దిసేపే తెరపై కనిపించినా, తన నటనతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తారు. జోడీ ఫోస్టర్ కూడా క్లారిస్ పాత్రలో అద్భుతంగా నటించింది. దర్శకుడు జోనాథన్ డెమ్మే సస్పెన్స్ను, పాత్రల మధ్య జరిగే మానసిక పోరాటాన్ని ఎంతో రియాల్టీగా తెరకెక్కించారు. యాక్షన్ కంటే కథ, పాత్రలు, మైండ్ గేమ్స్కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు ఇష్టపడేవారికి ఇది తప్పకుండా చూడాల్సిన క్లాసిక్. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లో ఇప్పటికీ ఈ సినిమా ఒక బెంచ్మార్క్గా నిలిచింది.
Read Also : ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన సిరీసులు… ‘ధురందర్ 2’ వ్యూస్ ఎంతంటే ?