True Crime Drama Series on OTT : రియల్ క్రైమ్ స్టోరీల ఆధారంగా తెరకెక్కుతున్న సిరీస్ లకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంది. అలాగే సీరియల్ కిల్లర్ కంటెంట్ ను ప్రేక్షకులు వదలకుండా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది 1970ల కాలంలో అమెరికాలో జరిగిన యథార్థ ఘోరాల ఆధారంగా ఒక ట్రూ-క్రైమ్ సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్ డ్రామా తెరకెక్కింది. ఈ మినీ సిరీస్ సమాజంలో పెద్ద మనిషిలా చలామణి అయిన ఒక నరరూప రాక్షసుడిని పోలీసులు ఎలా వెంటాడి పట్టుకున్నారనే ఉత్కంఠభరితమైన విచారణతో సాగుతుంది. దాదాపు 33 మందిని చంపిన అతను ఇన్నేళ్లు చట్టం నుండి ఎలా తప్పించుకోగలిగాడనే వ్యవస్థాగత లోపాలను కూడా ఈ సిరీస్ ఎత్తి చూపుతుంది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..
ఈ అమెరికన్ ట్రూ క్రైమ్ డ్రామా మినీ సిరీస్ పేరు ‘డెవిల్ ఇన్ డిస్గైజ్: జాన్ వేన్ గేసీ’ (Devil in Disguise: John Wayne Gacy). 1970ల కాలంలో డజన్ల కొద్దీ యువకులను దారుణంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్ ‘జాన్ వేన్ గేసీ’ జీవితం, అతను చేసిన ఘోరాల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ఇది 2025 అక్టోబర్ 16న పీకాక్ (Peacock) ఓటీటీ ప్లాట్ఫారమ్ లో మొత్తం 8 ఎపిసోడ్లతో రిలీజ్ అయింది. పాట్రిక్ మాక్మాన్ దీనిని రూపొందించారు. ఈ సిరీస్ 2021లో వచ్చిన ప్రముఖ ఎన్బీసీ (NBC) డాక్యుమెంటరీ ఆధారంగా రూపొందింది. అందులోని కిల్లర్ గేసీ జైలు ఇంటర్వ్యూ ఫుటేజ్ ఆధారంగా స్క్రిప్ట్ రాసుకున్నారు. జాన్ వేన్ గేసీ పాత్రలో నటించిన మైఖేల్ చెర్నస్ తన అద్భుతమైన నటనతో విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నారు. వినూత్నమైన మేకింగ్ శైలి వల్లనే రోటెన్ టొమాటోస్ ప్లాట్ఫారమ్పై ఈ సిరీస్ 96% పాజిటివ్ రేటింగ్ సాధించింది. అలాగే ఐయండిబిలో దీనికి ఏడుకు పైగా రేటింగ్ కూడా ఉండి. ప్రముఖ మీడియా సంస్థలు సైతం దీనిని అత్యంత ప్రభావవంతమైన క్రైమ్ డ్రామాగా అభివర్ణించాయి. ప్రస్తుతం ఇది జియో హాట్ స్టార్ లో కూడా అందుబాటులో ఉంది.
1970ల చికాగో నేపథ్యంలో ఇది జరిగింది. అక్కడ పిల్లలను నవ్విస్తూ జోకర్ వేషాలు వేసే జాన్ వేన్ గేసీ, పైకి మంచివాడిలా నటిస్తూ లోపల నరరూప రాక్షసుడిగా మారాడు. ఉద్యోగాల పేరుతో అమాయక కుర్రాళ్లను నమ్మించి, తన ఇంటి కిందే 33 మందిని అతి దారుణంగా చంపి పాతిపెట్టిన దారుణమైన మనిషి అతను. రాబర్ట్ పీస్ట్ అనే యువకుడు కనిపించకుండా పోవడంతో, రాఫెల్ తోవర్ అనే పోలీస్ ఆఫీసర్ గేసీపై అనుమానంతో దర్యాప్తు మొదలుపెట్టాడు. చివరికి పోలీసుల కళ్లు కప్పి తిరిగిన గేసీ ఇంట్లో శవాల కుప్పలు బయటపడటంతో ఆ నరకకూపం వెలుగులోకి వచ్చింది. సమాజంలో పెద్ద మనిషిలా చలామణి అవుతూ దారుణాలకు ఒడిగట్టిన ఆ రాక్షసుడికి, కోర్టు చివరకు 1994లో ఉరిశిక్ష విధించింది. ఈ కథ సామాజిక నిర్లక్ష్యాన్ని, బాధితుల కుటుంబాల వేదనను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
Read Also : మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కోర్ట్ రూమ్ క్రైమ్ థ్రిల్లర్… క్లైమాక్స్ కోసం ఈ సినిమా చూడాల్సిందే