Veerappan The Bandit King OTT : కన్నడ చిత్రనిర్మాత ఎ.ఎం.ఆర్. రమేష్ మళ్లీ వీరప్పన్ సాగాను తిరిగి తీసుకొచ్చారు. ఈసారి అది సినిమా కాదు, 18 నుంచి 19 గంటల ఫుటేజ్తో భారీ వెబ్ సిరీస్. వీరప్పన్ జీవితం వంటి సెన్సేషనల్ అంశాలపై ఆయన ఎప్పటినుంచో పని చేస్తున్నారు. ఇప్పుడు అది డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్దమవుతోంది. మరి ఇది ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం.
మొత్తం సిరీస్ మూడు సీజన్లుగా రూపొందుతోంది. మొదటి సీజన్ ‘వీరప్పన్ ది బ్యాండిట్ కింగ్’ (Veerappan The Bandit King) 6 ఎపిసోడ్లతో మొత్తం 4.5 గంటల రన్ టైమ్ ఉంటుంది. సీజన్ 1: వీరప్పన్ బాల్యం నుంచి గంధపు చెక్క స్మగ్లింగ్, ఏనుగుల వేట వరకు వివరంగా చూపిస్తుంది. 1993లో కర్ణాటక పోలీసు అధికారి శంకర్ బిదారిని టాస్క్ ఫోర్స్కు నాయకుడిగా నియమించడంతో ముగుస్తుంది. ఇక సీజన్ 2: శంకర్ బిదారి MM హిల్స్ అడవుల్లో గడిపిన 3 సంవత్సరాలు. ఈ కాలంలో జరిగిన వివాదాలు కూడా చూపిస్తారు. సీజన్ 3: ఆపరేషన్ కోకూన్, డాక్టర్ రాజ్కుమార్ కిడ్నాప్, వీరప్పన్ ఎన్కౌంటర్ హత్య వరకు పూర్తి కథ ఉంటుంది.
ఈ ఐకానిక్ రోల్ లో కిషోర్ మళ్లీ వీరప్పన్ పాత్రలో కనిపించనున్నారు. శంకర్ బిదారి పాత్రకు ఇంకా నటుడిని ఎంపిక చేయాల్సి ఉంది. దివంగత నటుడు డాక్టర్ రాజ్కుమార్ పాత్రలో ప్రముఖ హిందీ నటుడు సురేష్ ఒబెరాయ్ నటించే అవకాశం ఉంది. ఇతర కీలక పాత్రలు కూడా త్వరలో ఖరారు కానున్నాయి. వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ దీనిని స్ట్రీమింగ్ చేయబోతోంది. 2026 ఫిబ్రవరి 27న ప్రీమియర్ డేట్ కూడా ఖరారు చేశారు. ఇది కన్నడ, తమిళం, హిందీ ఆడియో ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. మొదటి సీజన్ 4.5 గంటలు మాత్రమే ఉంటుంది.
మునిస్వామి వీరప్పన్ (1952–2004) భారతదేశ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన బందిపోటు స్మగ్లర్. దాదాపు 36 ఏళ్ల పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ అటవీ ప్రాంతాల్లో ఒక సామ్రాజ్యాన్ని నడిపాడు. 10,000 టన్నులకు పైగా గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేయడమే కాకుండా, ఏనుగు దంతాల కోసం సుమారు 2,000 ఏనుగులను చంపినట్లు అంచనా. సుమారు 184 మందిని చంపినట్లు కేసులు ఉన్నాయి. అయితే వీళ్ళల్లో సగం మంది పోలీసులు, అటవీ అధికారులే ఉన్నారు.
2000వ సంవత్సరంలో కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్కుమార్ ను కిడ్నాప్ చేసి 108 రోజుల పాటు అడవిలో బంధించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. వీరప్పన్ను పట్టుకోవడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. చివరికి 2004, అక్టోబర్ 18న తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్ కె. విజయ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ‘ఆపరేషన్ కోకూన్’లో వీరప్పన్ హతమయ్యాడు. ఆంబులెన్స్లో వస్తున్న వీరప్పన్ను పక్కా ప్లాన్ తో చుట్టుముట్టి కాల్చిచంపారు.
Read Also : హెబ్బా పటేల్ తెలుగు హారర్ మూవీ ఓటీటీలోకి… దాదాపు రెండు నెలల తర్వాత… ఐయండిబిలో టాప్ రేటింగ్