ఉద్యమకారుల అంశం ఇప్పుడు సర్కార్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. నిన్న అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన మీటింగులో ఉద్యమకారులను ఎలా గుర్తించాలి? ఎన్ని కేటగిరీలు విభజించి.. వారికి ఏమేమీ చేయాలనే దానిపై అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించారు. దీనిపై ఇంకా లోతైన కసరత్తు నడుస్తోంది. అప్పటికే అందరి సూచన మేరకు ఓ నాలుగు కేటగిరీలుగా ఉద్యమకారులను గుర్తించి.. ఆమేరకు వారికి ఇచ్చిన హామీకు తగ్గట్టు మేలు చేయాలని సర్కార్ భావిస్తోంది. అయితే ఇది ఎంతగా లేటైతే అన్ని ఉద్యమకారుల సంఘాలు రాష్ట్రంలో కొత్తగా పుట్టుకొస్తున్నాయ.
వాస్తవానికి కేసీఆర్ గుర్తించకుండా ఉండిపోయిన వారిలో అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, పోలీసు కేసులు ఎదురొన్న వాళ్లు, జైలు జీవితం గడిపినోళ్లు..మొత్తం ఐదువేలకు మించి ఉండరు. కానీ ఇప్పటి వరకు యాభైవేల దరఖాస్తులు వచ్చి ఉన్నాయి. వీటిని స్క్రూటినీ చేసే పనిలో భాగంగా సర్కార్ ఇంటెలిజెన్స్ పోలీసుల సాయం తీసుకుంటున్నది. అప్పుడు ఉద్యమ సమయంలో ఎవరెవరికి లబ్ది జరిగింది. నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారెంత మంది..? నాలుగు కేటగిరీల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారనే విషయంలో లోతైన పరిశీలన చేస్తున్నది. అప్పుడు కేసీఆర్ సాంస్కృతిక సారధి పేరుతో ఓ 600 మందికి ఉపాధిని కల్పించాడు.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించి.. కుటుంబానికి పది లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారు. అంతకు మించి ఇంకా ముందుకు పోలేదు. దాన్ని అక్కడే వదిలిపెట్టేశారు. ఇలా కేసీఆర్ వదిలిపెట్టేసిన నిజమైన ఉద్యమకారుల లిస్టు కోసం సర్కార్ గాలిస్తున్నది. ఇందుకోసం ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం తీసుకుంటున్నది. ఇప్పుడు ఇదే కీలకంగా కూడా మారనుంది. అయితే ఆలోగా విద్యార్థి సంఘాల నాయకులతో కూడా కేకే కమిటీ మీటింగు పెట్టుకోనుంది. ఉస్మానియా, కాకతీయ విద్యార్థులతో కూడా విడివిడిగా సమావేశాలు పెట్టనున్నారు.
ఇవన్నీ పూర్తియిన తరువాతే నిజమైన ఉద్యమకారులను గుర్తించి, వీరిని కేసుల తీవ్రత, జైలు జీవితం, బైండోవర్ల ఆధారంగా కేటగీరిలోగా విభజించి..ఆ తరువాత ఇంటి స్థలమూ, పింఛన్.. ఇవన్నీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఉద్యమకారులు ఈ స్కీంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. దీన్ని పకడ్బందీగా అమలు చేస్తే… సర్కార్కు మంచి పేరు రానుంది. ఉద్యమకారులు కేసీఆర్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన గుర్తించని తమను రేవంత్ గుర్తించాడనే పాజిటివ్ కోణంలో వారంతా సర్కార్కు మద్దతుగా ఉండనున్నారు.