కిషన్రెడ్డిని తుక్కు తుక్కు తిట్టిన రేవంత్.. ఆ వెంటనే పీఎం అపాయింట్మెంట్ తీసుకున్నారు. నేరుగా కలిశారు. ఇక్కడ ఏ అంశాలైతే లేవనెత్తారో అవన్నీ మోడీ ముందు ఏకరువు పెట్టారు రేవంత్రెడ్డి. మహారాష్ట్ర సీఎంతో కలిపించండి అనే దగ్గర నుంచి… రాష్ట్ర ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లు.. అన్ని అంశాలను ప్రధాని ముందుంచారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రింగు రోడ్డు అంశం… ఇంకా 25 వేల టన్నుల ధాన్యం కొనుగోలు అంశాలన్నీ ప్రధాని ముందుంచారు. అన్నీ సావధానంగా ఆయన విన్నారు. కిషన్రెడ్డి మధ్యవర్తిత్వం లేకపోగా సహాయ నిరాకరణ కూడా తోడుకాగా.. విసిగెత్తి పోయిన సీఎం.. కిషన్రెడ్డి తీరుపై బాహాటంగానే విరుచుకుపడిన విషయం తెలిసిందే.
ఓవైపు రాజకీయంగా బీజేపీ వైఖరి పట్ల పోరాటం చేస్తూనే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్రానికి చేయాల్సిన బాధ్యతలు, నిధుల విడుదల, పర్మిషన్ల గురించి కూడా ఒత్తిడి పెంచే క్రమాన్ని వీడలేదు రేవంత్. ఇక్కడ కిషన్రెడ్డిని రెండు రకాలుగా డమ్మీ చేశారు రేవంత్. ఒకటి .. కిషన్రెడ్డి రాష్ట్రానికి తను చేయాల్సిన పనులు చేయకపోవడం ఒక వైఫల్యమైతే.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పడం ద్వారా అతన్ని విలన్గా తెలంగాణ సమాజం ముందు నిలపడం. ఈ రెండు విషయాల్లోనే కాదు.. సీఎంగా తన పని తాను చేసుకుపోవడంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పీఎంను కలిసి పరిస్థితుల తీవ్రతను తెలియజేయడంతో పాటు రావాల్సిన అనుమతులు, నిధుల విషయంలో ఒకటికి పదిసార్లు అడిగి ఒత్తిడి తేవడం.
దీని మూలంగా.. తెలంగాణ సమాజం ముందు ఎవరెలా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ఖుల్లంఖుల్లాగా బయటపెట్టడం ద్వారా మళ్లీ అవసరమైతే మోడీ కక్షపూరిత విధానాన్ని కూడా ఎండగట్టాలనే వ్యూహం కూడా ఇందులో ఇమిడి ఉంది. ఇక్కడ కేసీఆర్ పాలనతో పోల్చితే.. ఇద్దరి మధ్య తేడాలు కనిపిస్తాయి. కేసీఆర్ పంతం పడితే కనీసం అటువైపు కన్నెత్తి చూడడు. పల్లెత్తు మాట్లాడాడు. అంతే డోన్ట్ కేర్ అంటాడు. దీని వల్ల రాష్ట్రానికి నష్టమే జరిగింది. మొదట మోడీతో రాసుకు పూసుకు తిరిగిన కేసీఆర్.. తరువాత ఇద్దరి మధ్య చెడడంతో ఒక్కసారిగా పూర్తిగా దూరమయ్యాడు మోడీకి. ఎంతలా అంటే.. మోడీ హైదరాబాద్కు వచ్చినా కలవనంతగా. ఢిల్లీ వెళ్లినా ఆయన్ను కలవనంతగా.
ఆయనను కలవాలనుకునే ప్రయత్నమనే మాటే తన డిక్షనరీలోంచి తీసేసేంతగా. కేంద్రంతో గ్యాప్ పెంచుకోవడం మూలంగా బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదు. ఒకటికి పదిసార్లు కలిస్తేనే కనుకరించని కేంద్రం పెద్దలు.. అసలే మాట్లాడకుండా.. ఇక్కడే కూర్చుని రోజూ తిడుతూ ఉంటే పని చేసి పెడతారా? అదే జరిగింది గతంలో. ఇప్పుడూ అదే జరుగుతున్నది. కానీ కొంచెం భిన్నంగా. తిట్టుడు తిట్టుడే .. కలుసుడు కలుసుడే.. అనే సిద్దాంతం ప్రకారం పోతున్నారు సీఎం రేవంత్రెడ్డి. ఆయన ముందే చెప్పి ఉన్నారు. నాకు ఎలాంటి నామోషీలు లేవు. కేంద్రంతో మంచిగానే ఉంటా. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఢిల్లీకి వందల సార్లైనా పోతా!అని ప్రకటించుకుని ఉన్నారు. అదే ఇప్పుడు చేస్తున్నారు. దీని వల్ల కేంద్రం పెద్దలు కూడా కొంచెమైనా దిగిరావాల్సిందే. ఇప్పుడు కాకపోయినా.. కొంత కాలానికైనా.